సాక్షి, మహబూబాబాద్: ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి చెట్లు విరగపూసాయి. చెట్లకు ఆకులు కనిపించకుండా మొత్తం పూతే కనిపిస్తే చెట్టు విరిగిపోయే విధంగా కాపు వస్తుందని రైతులు సంబురపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతసేపు నిలువలేదు. మాయదారి మంగు రోగంతో పూత రాలిపోయింది. కాత తేలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో కాసిన కాయలు మంచి కలర్ వచ్చి మార్కెట్లో అధిక రేటు పలకాలంటే కవర్లు తొడుగితే ఫలితం ఉంటుందంటున్నారు ఉద్యాన వన శాఖ అధికారులు.
గతంలో మంచి ఫలితం
మామిడికాయలకు పిందె దశలో కవర్లు తొడుగితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు రైతులు. జిల్లాలో 15 వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. ఇందులో పలువురు రైతులు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ, గార్ల మొదలైన మండలాల్లో సుమారు 20 మంది రైతులతో ఈ ప్రయోగం చేయించారు. సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే కవర్లు కట్టి పెంచిన పండ్లు ఆకర్షనీయమైన రంగు రావడంతో 50శాతం రేటు అధికంగా పెట్టి వినియోగదారులు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు.
రసాయనాల ప్రభావం తక్కువ
కవర్లు తొడిగి పెంచిన మామిడి పండ్లపై తోటపై పిచికారీ చేసే రసాయనాల ప్రభావం తక్కువగా ఉంటుంది. పండుపై ఈగలు, దోమలు, మంగు వంటి శిలీంధ్రాల ప్రభావం కూడా తక్కువే. కవర్ కాయ తొడిమకు కాకుండా చెట్టు కాండానికి కట్టడంతో వడగండ్ల వాన, గాలి దుమారం వచ్చినా.. కాయ రాలిపోకుండా ఉంటుంది.
ఎకరానికి రూ.10వేల ప్రోత్సాహకం
కవర్లు కట్టి కాయలను పెంచడం మూలంగా మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం దీనిని ప్రోత్సహించేందుకు పూనుకుంది. ఇందుకోసం ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు ప్రోత్సాహకం అందిస్తుంది. జిల్లావ్యాప్తంగా 15వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఇందులో ఈ ఏడాది 200 ఎకరాలకు ప్రోత్సాహకం అందించనున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
మామిడికాయలకు కవర్ల తొడుగు
ఆకర్షణీయమైన రంగుతో పండ్లు
రసాయనాల ప్రభావం తక్కువ
వడగళ్ల వాన, గాలి దుమారం నుంచి రక్షణ
ఎకరాకు రూ.10వేల ప్రోత్సాహకం


