తొర్రూరు రూరల్: అనుమానంతో భర్త వేధించడాన్ని తట్టుకోలేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మానుకోట జిల్లా తొర్రూరు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పనికెర అనూష(22) హరిపిరాల గ్రామానికి చెందిన పులిగుజ్జ సాయి ఆరేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినా వారిరువురు విడిపోకుండా బంధానికి కట్టుబడ్డారు. కానీ, గత కొద్ది కాలంగా సాయి ప్రవర్తనలో మార్పు వచ్చి భార్యను అనుమానిస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగగా భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అనూష శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనూష తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, అనూషకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చెరువులో మునిగి
వ్యక్తి మృతి
హసన్పర్తి: ఈతకోసం నీటిలోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు వదిలాడు. ఈసంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురంలోని కుంటలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మట్టెవాడకు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్(43) చిరు వ్యాపారి. ప్రతీ రోజు ఉదయం ఇంటి నుంచి రెడ్డిపురంలోని కుంటకు ఈతకు వచ్చేవాడు. రోజు మాదిరిగానే శనివారం కూడా ఈతకు వచ్చి నీటిలో మునిగి మృతిచెందాడు. అయితే చెరువులో తేలిఉన్న మృతదేహాన్ని స్థానికులు సాయంత్రం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కల్యాణ్ తెలిపారు.
కెనాల్లో పడి ..
ఆత్మకూరు: ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పెండ్లి ప్రభాకర్(41) శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం దుర్గంపేట–సీతారాంపురం మధ్యలో కెనాల్లో పడి మృతిచెందిఉండడాన్ని గమనించారు. బహిర్భూమికి వెళ్లి కెనాల్లోకి వెళ్లగా ప్రమాదవశాత్తు మృతిచెందాడని ప్రభాకర్ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


