హన్మకొండ: కృత్రిమ మేధ వినియోగంతో విద్యుత్ రంగంలో సేవలు వేగంగా అందుతున్నాయని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన ‘ఏ.ఐ హ్యాకథాన్’ పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్ మిట్టల్తోపాటు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పాల్గొన్నారు. సంస్థలోని అన్ని విభాగాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఏ.ఐ సాంకేతికతతో రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే చేపడుతున్న డిజిటల్ చర్యలు, భవిష్యత్లో అమలు చేయనున్న ఏఐ ఆధారిత పరిష్కారాలను నవీన్ మిట్టల్ సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన సేవలు అందించడమే టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని, కృత్రిమ మేథ అమలు ఆ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గతంలో రోజులు పట్టే పనులు ఇప్పుడు కేవలం నిమిషాల్లో పూర్తవుతున్నాయని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఫిర్యాదుల పరిష్కారం కూడా వేగవంతమైందన్నారు. భవిష్యత్లో ఏఐ వినియోగం మరింత విస్తరించి విద్యుత్ రంగాన్ని పూర్తిగా స్మార్ట్గా మార్చుతుందన్నారు. ప్రతి విభాగం తమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేథను వినియోగిస్తే అధిక ఫలితాలు సాధించవచ్చని సూచించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అడుగులు వేస్తూ కృత్రిమ మేథ వినియోగం ద్వారా విద్యుత్ రంగంలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత పెరిగి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఎన్పీడీసీఎల్ ముందుకెళ్తుందన్నారు. అనంతరం ఓగులాపూర్ 400 కేవీ మానవ రహిత సబ్ స్టేషన్ను సందర్శించారు. నిర్వహణ పద్ధతులు, అనుసరిస్తున్న విధానాలు, ఓల్టేజీ స్థాయిలు, తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, సురేందర్, వెంకట రమణ, మాధవ రావు, అన్నపూర్ణ, సీజీఎంలు రవీంద్రనాథ్, కిషన్, జాయింట్ సెక్రెటరీ రమేష్, ట్రాన్స్ కో సీఈ శ్రీరామ్ కుమార్, డీఈ మహేష్ పాల్గొన్నారు.
నవీన్ మిట్టల్


