మహబూబాబాద్ రూరల్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి ముబిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఓపీఎస్ను అమలు చేయకపోతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్, ఉద్యోగులు ఫిరోజ, నాగముని, ఆవునూరి రవి, రఫీక్, కొప్పుల నాగరాజు, రవీందర్, రాంజీనాయక్, బలాష్టి రమేష్, సింగు రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, న్యాయవాదులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్లు
మహబూబాబాద్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ప్రక్రియపై కసరత్తు జరుగుతుందని గత నెల 16వ తేదీన ‘డిప్యుటేషన్లపై కసరత్తు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈనెల 4న (శని వారం) కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లాలోని 406 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్ల జాబితా విడుదల చేసినట్లు డీపీఓ హరిప్రసాద్ తెలిపారు. అయితే గైడ్లైన్స్ పాటించకుండా దూరంగా వేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం కలెక్టర్ను కలిసి విన్నవించారు.
దరఖాస్తుల గడువు పెంపు
మహబూబాబాద్ అర్బన్: ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాల గడువు ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు కె. శ్రీనివాస్ శని వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీయువకులు, నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ హార్డ్ కాపీలను, ధ్రువపత్రాలను పట్టణంలోని వారు మున్సిపాలిటీ కార్యాలయం, గ్రామీణ ప్రాంతంలోని వారు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్ కులముల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు..
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ టి.రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వారి నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుందని, వారిలో ఒకరు మహిళకు అవకాశం ఉంటుందన్నారు. మైనార్టీస్ నుంచి ఇద్దరికి అవకాశం ఉండగా వారిలో ఒకరికి మహిళకు అవకాఽశం ఉంటుందన్నారు. రెండు కేటగిరిలో ఉండగా పరిపాలన ప్రత్యేక పరిజ్ఞానం కేటగిరిలో దరఖాస్తు చేసుకునే వారు ఓటరు జాబితాలో ఓటు ఉండాలని, 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


