చిల్పూరు: జాతర చూసేందుకు వెళ్లి వాగులో పడి ఇద్దరు బాలురు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన గూటం ప్రవీణ్–హరిత దంపతుల కుమారుడు అఖిలానంద (14) ఎనిమిదో తరగతి, నూనె సదానందం–స్వప్న దంపతుల కుమారుడు మనోజ్కుమార్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ గ్రామంలోని రామాలయం దగ్గర జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను చూసేందుకు సాయంత్రం ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్లారు. అనంతరం రామాలయం వెనుక ఉన్న ఆకేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ సైకిల్ కడుగుతున్న సమయంలో రైతులు వాగు దాటేందుకు ఏర్పాటు చేసుకున్న తెడ్డు కనిపించింది. దానిపై సైకిల్ పెట్టి ఇద్దరు కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. అదిఒక పక్కకు ఒరగడంతో సైకిల్తో పాటు ఇద్దరు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగి మృతి చెందారు. కొద్దిసేపటికి కొందరు రైతులు అటుగా వెళ్తుండగా వాగు ఒడ్డుకు చెప్పులు కనిపించాయి. అనుమానంతో వాగులో గాలించగా నీటిలో మునిగిన సైకిల్తోపాటు వారి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మనోజ్కుమార్(ఫైల్) ,
అఖిలానంద (ఫైల్)
ఆకేరు వాగులో పడి ఇద్దరు బాలుర మృతి
జనగామ జిల్లా వంగాలపల్లిలో విషాదం


