చెన్నారావుపేట: ఆటలాడుకున్న ఇంటి అరుగే ఆ చిన్నారులకు సమాధిగా మారింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోడమాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రాఘవేంద్ర కాలనీలో స్రవంతితోపాటు ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు బంధువులు ప్రవీణ్ ఇంటి ఎదుట గుంతలు తీశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి కళ్లలో కారం చల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలను ఈ గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని వారి పత్తిచేనులో దహనం చేశారు. ప్రవీణ్ ఇంటి ఎదుట సమాధి చేసిన చిన్నారుల మృతదేహాలు మళ్లీ తీసే ప్రసక్తే లేదని తండావాసులు తెగేసి చెబుతున్నారు. కాగా, మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా.. స్థానిక సర్పంచ్ ఉమామోహన్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు.
బోడమాణిక్యం తండాలో పిల్లల
మృతదేహాల పూడ్చివేత


