● చైనా మిర్చి వ్యాపారులు జాక్, యాన్మిన్
● మానుకోట ఏఎంసీలో మిర్చి పరిశీలన
మహబూబాబాద్ రూరల్: రైతులు మిర్చి సాగులో పురుగు మందుల వాడకం తగ్గించాలని చైనా దేశ మిర్చి వ్యాపారులు జాక్, యాన్మిన్ కోరారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును గురువారం సందర్శించి తేజ రకం మిర్చి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చైనా దేశంలో తేజ మిర్చి కంటే ఘాటు ఎక్కువగా, తక్కువగా ఉండే మిర్చిని పండిస్తారని, అయినా భారతదేశంలో పండే తేజ రకం మిర్చిని దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. చైనా ప్రజలు వంటల్లో భారతదేశ మిరప కారాన్ని ఉపయోగిస్తారని, గత సంవత్సరం చైనా దిగుమతి చేసుకున్న తేజ రకం మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండడంతో సుమారు 100 కంటైనర్లు వెనక్కి పంపించారన్నారు. రైతులు మిర్చిలో ఆకులు, గింజలు లేకుండా శుభ్రంగా ఉండే విధంగా, తేమ లేకుండా మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ మాట్లాడుతూ.. చైనా వ్యాపారులు ఇక్కడి మిర్చి శాంపిల్ తీసుకుని వెళ్లి పరీక్ష చేసుకుంటారని, ఆ పరీక్షలో పురుగు మందుల అవశేషాలు తక్కువగా ఉంటే దిగుమతి చేసుకుంటామని తెలిపారన్నారు.


