తొర్రూరు: చేపల వలలో చిక్కుకుని మత్స్య కార్మికుడు మృతి చెందిన ఘటన గురువారం డివిజన్ కేంద్రంలో జరిగింది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు...తొర్రూరు పట్టణంలోని అలువాల మురళి (48) చేపల పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం ఎప్పటిలానే సాయంత్రం చేపల వేటకు స్థానిక పెద్ద చెరువుకు వెళ్లాడు. చేపల కోసం వల వేయగా అది అతడి కాళ్లకు చుట్టుకుని చెరువులో పడి మునిగాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది చెరువు వద్దకు వెళ్లి చూడగా వల చుట్టుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య గత కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా.. కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


