● కలెక్టర్ స్నేహ శబరీష్
కురవి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల కేంద్రంతో పాటు మొగిలిచర్ల గ్రామంలో కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. కురవిలోని ఉన్నత పాఠశాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ అమలు చేయాలని, ప్రతీ రోజు అందించే ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, షెడ్యూల్ ప్రకారం పిల్లలకు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, పాఠశాల ఆవరణలో పెండింగ్లో ఉన్న టాయిలెట్, కిచెన్షెడ్, వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధి లోని సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. మందులను సిద్ధంగా ఉంచాలని, వేసవి కాలంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పాఠశాల, వైద్యశాల ఇతర ప్రదేశాల్లో నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుని శానిటేషన్ నిర్వహించాలని వివరించారు. మొగిలిచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. మొగిలిచర్లకు మంజూరైన ఇళ్లలో ఇప్పటి వరకు 10స్లాబ్ లెవల్, జగ్యా తండాలో 15 మంజూరు కాగా తొమ్మిది స్లాబ్లెవల్ పూర్తి అయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ హనుమ నాయక్, కురవి తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ కె.వీరబాబు, ఎంఈఓ బాలాజీ, సర్పంచ్ బాదావత్ లక్ష్మి పాల్గొన్నారు.


