మహబూబాబాద్ రూరల్ : పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకుని, గర్భవతిని చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం పీఎస్లో వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్లోని కంకరబోర్డు ప్రాంతానికి చెందిన ఎండీ మౌలానా అనే యువకుడు స్థానిక ఓ ఫొటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఓ బాలిక ఫొటో దిగేందుకు స్టూడియోకు రాగా ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలికలో మార్పును గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో విషయం చెప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతిగా తేలింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. మౌలానాపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని టౌన్ సీఐ తెలిపారు. టౌన్ ఎస్సై మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.


