సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కాగా ఇళ్లు మంజూరై నిర్మాణ పనులు చేపట్టని పలువురు లబ్ధిదారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క దృష్టి పెట్టింది. పేదలు మొదట పెట్టుబడి పెట్టి ఇల్లు నిర్మించుకునేందుకు వెనుకాడుతున్నారు. ఈక్రమంలో కొందరు లబ్ధిదారులు మంజూరైన ఇంటిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని పేదలకు సహకారం అందించేందుకు అధికారులు వినూత్నంగా ఆలోచించారు. మీ వద్ద డబ్బులు లేకపోతే అప్పులు ఇప్పిస్తాం.. ఇల్లు కట్టుకోండి అంటూ లబ్ధిదారుల వద్దకు అధికారులు వెళ్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ప్రారంభించని ఇళ్లు..
ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,181 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇందులో 8,665 ఇళ్లు ప్రారంభించారు. మిగిలిన 1,516 ఇళ్లు వివిధ కారణాలతో ప్రారంభించలేదు. అయితే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి కాగానే రెండో విడత ప్రారంభిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాగా, మిగిలిన 1516 ఇళ్లను ప్రారంభించేందుకు ఈనెల చివర వరకు అవకాశం కల్పించారు.
నిర్మించుకోండి..
ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ.. కట్టుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ముందు బేస్మెంట్ లెవల్ వరకు నిర్మిస్తేనే మొదటి బిల్లు వస్తుంది. పేదవారు కావడంతో ముందు పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముందు ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి కావాల్సిన డబ్బులను అప్పుగా ఇప్పించే పనిలో అధికారులు ఉన్నారు. ఇందుకోసం లబ్ధిదారులు సభ్యలుగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు, వెలుగు అధికారులతో మాట్లాడి సదరు మహిళకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు అప్పు ఇవ్వాలని సిఫారసు చేస్తున్నారు. ఈ డబ్బులతో ఇల్లు ప్రారంభిస్తే బేస్మెంట్ లెవల్ బిల్లు ఇస్తామని.. అప్పుడు అప్పు తీర్చడంతోపాటు మిగిలిన నిర్మా ణం సాగుతుందని అంటున్నారు. అయితే ఇందుకు కొందరు మహిళలు ముందుకు రాగా.. మరికొందరు సంఘాల్లో లేకపోవడం, ఉన్నవారిలో కొందరికి అప్పు ఇచ్చేందుకు మిగిలిన సంఘ సభ్యులు అంగీకరించని వారు ఉండగా.. వారికి ఎలా అప్పు ఇప్పించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
మా సంగతేంటి..
అధికారులు చేసిన తప్పులతో ఇబ్బందులు పడుతున్న పలువురు అబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం అధికారులు, ఉద్యోగులు చేసిన సర్వేలో నిరుపేదలను సంపన్నులుగా, సంపన్నులను నిరుపేదలుగా నమోదు చేశారు. తీరా ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో నిరుపేదల పేర్లు లేకుండాపోయాయి. ఇందేంటి అని పరిశీలించగా సర్వే సందర్భంగా తప్పుగా నమోదు చేసినట్లు నిర్ధారించారు. అయితే మరో అవకాశం కల్పించి ఎల్–3లో ఉన్న 130మంది నిరుపేదలను ఎల్–1లో చేర్చి ఇల్లు మంజూరు చేశారు. అయితే వీరికి బేస్మెంట్ బిల్లు రూ.లక్ష వేసిన తర్వాత వివిధ కారణాలు చెబుతూ బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో ఉన్న ఇల్లు కూల్చి వేసి.. కొత్త ఇల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము ఇబ్బందులు పడుతున్నాం. బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు.
జిల్లాలో ప్రారంభం కాని
ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్
లబ్ధిదారుల వద్దకు అధికారులు
ఈనెల చివరి వరకు
కట్టుకోవాలని సూచన
అప్పటికీ ప్రారంభించని
ఇళ్ల రద్దుకు సిఫారసు
నియోజకవర్గం మంజూరైనవి నిర్మాణంలో ప్రారంభం
ఉన్నవి కానివి
మహబూబాబాద్ 3,499 2,982 517
డోర్నకల్ 3,447 2,911 536
ములుగు 1,043 926 117
పాలకుర్తి 1,050 881 169
ఇల్లెందు 1,142 965 177
మొత్తం 10,181 8,665 1,516


