మహబూబాబాద్: మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు తలెత్తితే.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపింగ్ చేయాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అధికారులను ఆదేశించారు. మానుకోట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అసంపూర్తి పైపులైన్ పనుల కోసం కోట్ల రూపాయలు విడుదల చేయించినట్లు తెలిపారు. వానాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా వరద కాల్వల కోసం రూ.12 కోట్లు విడుదల అయ్యాయని, ఆపనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మధ్యలో ఉన్న 11కేవీ విద్యుత్ స్తంభాలను త్వరలోనే తొలగిస్తామన్నారు. ఆదాయం పెంచుకుంటే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరుగుతుందని, పన్నుల పెంపు సాధ్యం కాదు కాబట్టి సీడీఎంఏతో మాట్లాడుతానన్నారు. కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నా రు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో అందరూ భా గస్వాములు కావాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. అందరి సహకారంతో అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ.. పట్టణంలో ప్రధానంగా పారిశుద్ద్య సమస్య పరిష్కా రం కోసం కృషి చేస్తామన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవడం సరికాదని అన్నారు.
కౌన్సిలర్లు ఏం మాట్లాడారంటే..
● సీపీఐ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇంటి నంబర్లు ఇవ్వాలన్నారు.
● కౌన్సిలర్ బానోత్ తేజస్విని మాట్లాడుతూ.. తన వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వాహనాలు సక్రమంగా రావడం లేదన్నారు.
● కౌన్సిలర్ మత్యం వెంకన్న మాట్లాడుతూ.. సుమారు రూ.10లక్షలతో వార్డులో ఖాళీ స్థలా లను శుభ్రం చేయించడంతో పాటు కాల్వలు శుభ్రం చేయించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు.
● కౌన్సిలర్ గుగులోత్ నరేష్ మాట్లాడుతూ.. వార్డులో 11కేవీ విద్యుత్ తీగల సమస్యతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలన్నారు.
● కౌన్సిలర్ చిట్యాల జనార్దన్ మాట్లాడుతూ.. బంధం చెరువు, నిజాం చెరువులు అలుగుపోసిన సమయంలో ఆప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలన్నారు.
● కౌన్సిలర్ గాడిపెల్లి నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు.
● కౌన్సిలర్ చిదిరాల అరుణ మాట్లాడుతూ.. తన వార్డు పరిధిలో ఆస్పత్రులు, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయని, కార్మికుల సంఖ్య పెంచాలని, రెండు ట్రాక్టర్లు కేటాయించాలన్నారు.
స్వల్ప వాగ్వాదం..
● కౌన్సిలర్ తేజస్విని మాట్లాడుతూ ఎమ్మెల్యేను అంకుల్ అని సంబోధించడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సల్వాది దిలీప్ అలా మాట్లాడడం సభా మర్యాద కాదన్నారు. ఆ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తర్వాత పలువురి కౌన్సి లర్ల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
● సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్సారథి సభను కమిషనర్ నిర్వహించవద్దని, చైర్పర్సన్ నిర్వహించాలని కమిషనర్తో స్వల్ప వాగ్వాదం చేశారు. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య జోక్యం చేసుకుని చైర్పర్సన్కు కొత్త కాబట్టి మాట్లాడడం కొంత సమయం పడుతుందని సమాధానం ఇచ్చారు.
● సమావేశానికి వచ్చిన అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోకు కనీసం బొకే కూడా ఇవ్వరా అని కౌన్సిలర్ ముత్యం వెంకన్న కమిషనర్తో వాగ్వాదం చేశారు.
● కౌన్సిలర్ గుండా రాజశేఖర్ మాట్లాడుతూ.. సమావేశం ఉదయం 10.30గంటలకు ప్రారంభం కావాలని, కానీ 11.30 దాటినా ప్రారంభం కాలేదని, ఎమ్మెల్యే కోసం ఆలస్యం చేయడం సబబు కాదని, ఇది మున్సిపాలిటీ మీటింగ్ అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని స్వల్ప వాగ్వాదం చేశారు.
కలిసికట్టుగా పని చేయాలి
ఆదాయం పెంచుకుంటేనే
కార్మికుల పెంపు సాధ్యం
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
సీపీఐ కౌన్సిలర్ల నిరసన..
పలు విషయాలపై స్వల్ప వాగ్వాదం
మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం
సీపీఐ కౌన్సిలర్ల నిరసన..
మున్సిపాలిటీలోని 18,25,33 వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్సారథి రెడ్డి, కౌన్సిలర్లు రేషపల్లి నవీన్, నర్రా సంధ్య వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆతర్వాత 21అంశాలతో ఉన్న ఎజెండాపై చర్చించారు. కార్యక్రమంలో కమిషనర్ టి.రాజేశ్వర్, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, టీపీఓ సాయిరాం, ఏఈ కుమార్, మేనేజర్ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


