● కలెక్టర్ స్నేహ శబరీష్
నర్సింహులపేట: విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బోధన, అందుతున్న సౌకర్యాలు, మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్కు దీటుకు ఫలితాలు వచ్చేలా బోధన చేయాలని, పని చేయని ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఎంఈఓను హెచ్చరించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం తదితర అంశాలపై దృష్టిపెట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్య, డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్నాయక్, ఎంఈఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


