లింగాలఘణపురం : దంపతుల మధ్య జరిగిన గొడవతో మొదట భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆందోళన చెందిన భర్త తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చీటూరులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పసుల సోమరాజు(40) జ్యోతి దంపతులు. ఈ క్రమంలో శుక్రవారం భార్యభర్తల మధ్య తగాదా చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆందోళన చెందిన సోమరాజు అదే రోజు రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం స్థానికులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. భార్య జ్యోతి కోలుకుంది. ఈఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. కాగా, సోమరాజు, జ్యోతి దంపతులకు నలు గురు కూతుళ్లు ఉన్నారు. వీరంతా హాస్టల్లో చదువుకుంటున్నారు.
ఆందోళన కలిగిస్తున్న ఆత్మహత్యలు..
గొడవలతో దంపతులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు మండలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 26న గుమ్మడవెల్లికి చెందిన వేల్పుల అనిల్కుమార్ (38) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ 28న చనిపోయాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ నెల 2న మండల కేంద్రానికి చెందిన గట్టగల్ల స్వామి (39) మద్యానికి బానిసై పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఈ నెల 6న మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉంది. అదేవిధంగా చీటూరుకు చెందిన పసుల సోమరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమరాజుకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇలా మండలంలో వరుస ఘటనలతో మూడు కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. యజమానులు చనిపోవడంతో ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. క్షణికావేశంలో చోటు చేసుకుంటున్న ఈ ఘటనలపై ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
● భర్త ఆత్మహత్య ● చీటూరులో ఘటన


