మిర్చి రైతు ధరహాసం..
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు పెరుగుతున్నాయి. ఫలితంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మిర్చి సీజన్ డిసెంబర్ 1న ప్రారంభమైంది. అదే నెల మొదటి వారంలో క్వింటాల్ తేజ, యూఎస్–341 రకాలకు గరిష్టంగా రూ.12వేలు, వండర్హాట్కు రూ.14వేలు పలకగా బుధవారం తేజ రకానికి 20,200, యూఎస్–341 రకానికి రూ.25, 500, వండర్హాట్ రకానికి రూ.30వేలు ధర పలికింది. ఈనెల మొదటి వారం నుంచి ధరలు పెరుగుతుండడంతో గతేడాది కోల్డ్స్టోరేజీల్లో స్టాక్ పెట్టిన వ్యాపారులు నెమ్మదిగా బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. తాజాగా మార్కెట్ వస్తున్న మిర్చికి గరిష్ట ధరలు నమోదవుతున్నాయి. దీంతో ఏసీలో పెట్టిన మిర్చిని ధరలు పెంచి ట్రేడర్స్ కొనుగోళ్లు చేస్తున్నారు.
రెండేళ్ల తర్వాత తేజ రకానికి పెరిగిన ధర..
బుధవారం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి తేజ రకం మిర్చిని వ్యాపారులు రికార్డు ధర క్వింటాల్కు రూ.20,200తో కొనుగోలు చేశారు. రెండేళ్ల తర్వాత తేజ రకానికి ఈధర పలికినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం తెలిపారు. అదే విధంగా ములుగు జిల్లా బీరెళ్లి గ్రామానికి చెందిన గుత్త శేఖర్ యూఎస్–341రకం మిర్చి క్వింటాల్కు రూ.25,500, ఏటూరునాగారం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అగ్గు నర్సయ్య వండర్హాట్ రకం మిర్చికి రూ.30వేలు ధర పలికినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే మొదటి కాత మిర్చిని తీసుకొస్తున్నారు. బుధవారం సుమారు 2,500 బస్తాల వరకు మిర్చి వచ్చింది.
వరంగల్ మార్కెట్లో పెరుగుతున్న ధరలు
నెలరోజుల్లోనే రూ.10 వేలు పెరుగుదల
తేజ క్వింటాల్కు రూ.22, 500
యూఎస్–341 రూ.25,500
వండర్హాట్ రూ.30వేలు
ఆనందంగా ఉంది..
తేజ రకం మిర్చి క్వింటాల్కు వారం రోజులుగా రూ.14–16వేల వరకు పలికింది. బుధవారం మార్కెట్కు 6 క్వింటాళ్ల మిర్చి తీసుకొచ్చా. క్వాలిటీ ఉండడంతో వ్యాపారులు రూ.20, 200 పెట్టడం ఆనందంగా ఉంది.
–సమ్మిరెడ్డి, రైతు, కూనూరు,
జఫర్గఢ్ మండలం, జనగామ జిల్లా
మిర్చి రైతు ధరహాసం..


