మండమెలిగె.. జాతర మొదలాయె
ఎస్ఎస్తాడ్వాయి: మండమెలిగె పండుగ పూజా కార్యక్రమాలతో మేడారం మహాజాతర ఆరంభమైంది. బుధవారం మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో ఆచార, సంప్రదాయాలతో పూజారులు అమ్మవార్లకు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సమ్మక్క పూజారి సిద్ధబోయిన ముణిందర్ ఇంటికి చేరుకున్న పూజారులు.. అక్కడి నుంచి సమ్మక్క గుడికి వెళ్లి శుద్ధి చేశారు. అక్కడి నుంచి పసుపు, కుంకుమ, పవిత్ర జలం, దూపం తీసుకుని గ్రామ పొలిమేరలోని మైసమ్మ గుడి వద్దకు వెళ్లి పూజలు చేసి బొడ్రాయి వద్ద గ్రామదేవతలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. అనంతరం పసుపు, కుంకుమ పెట్టి మొక్కుకున్నారు.
దిష్టి తగలకుండా మామిడితోరణాలు..
గ్రామదేవతల పూజల అనంతరం పూజారులు.. సిద్ధబోయిన నితిన్ ఇంటి వద్ద అంతకు ముందు తయారు చేసిన మామిడి తోరణాలను తీసుకుని చిలకలగుట్టకు వెళ్లే దారి వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడకు తీసుకొచ్చిన బూరుక పచ్చి కర్రలకు పూ జారి కొక్కెర కృష్ణయ్య, వడ్డె మల్లెల సత్యం పసుపు, కుంకుమ రాశారు. మామిడి తోరణానికి సోరకాయ, కోడిపిల్ల, ఎండు మిరపకాయాలు కట్టి దొరస్తంభాలపై నిలిపారు.
సారలమ్మ కుండల అలంకరణ..
కన్నెపల్లి సారలమ్మ గుడిలో మండమెలిగె పండుగను సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కలిసి గుడిని శుద్ధి చేశారు. ఆడపడుచులు అలయాన్ని అలంకరించారు. సారలమ్మ వడ్డెలు కుండలను పసుపు, కుంకుమ పెట్టి అలంకరించారు. పూజారి కాక సారయ్య అమ్మవారి పూజ సామగ్రిని అడవి నుంచి తీసుకొచ్చిన మట్టితో శుద్ధి చేశారు. గ్రామ పొలిమేరలో తోరణాలు కట్టారు.
ఆలయాల నుంచి తల్లుల గద్దెలకు..
మేడారంలోని సమ్మక్క గుడి నుంచి పూజారులు అర్ధరాత్రి సమయంలో అమ్మవారి పూజ సామగ్రి, పసుపు, కుంకుమ, పవిత్రం జలం తీసుకుని గద్దెకు వెళ్తున్న దారిలో మహిళలు ఎదురెళ్లి నీళ్లు అరగించారు. పూజారులు సమ్మక్క గద్దైపెకి చేరుకున్న క్షణంలోనే విద్యుత్ దీపాలు ఆర్పేయడంతో పూజారులు రహస్య పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగియడంతో విద్యుత్ దీపాలు ఆన్ చేశారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ పూజారులు పసుపు, కుంకుమతో మేడారంలోని సారలమ్మ గద్దె వద్దకు చేరుకుని పూజలు చేశారు. సమ్మక్క– సారలమ్మ పూజారులు కలుసుకుని ఒకరికొకరు కంకణాలు కట్టుకున్నారు. సారలమ్మ పూజారులు ఆనవాయితీగా సమ్మక్క పూజారులకు సాకా(సార) ఇచ్చి పుచ్చుకుని రాత్రింతా గద్దెల వద్ద జగారాలతో సంబురాలు జరుపుకున్నారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని రాత్రి మంత్రి సీతక్క సందర్శించి మండమెలిగె పూజలో పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.
మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో పూజలు
నూతన వస్త్రాలు ధరించి.. తోరణాలు కట్టి..
అమ్మవార్ల గద్దెల వద్ద జాగారాలతో రాత్రంతా సంబురాలు
సారలమ్మకు మంత్రి సీతక్క పూజలు
మండమెలిగె.. జాతర మొదలాయె
మండమెలిగె.. జాతర మొదలాయె
మండమెలిగె.. జాతర మొదలాయె


