
నాణ్యతపై నజర్
న్యూస్రీల్
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలోని పల్లెల్లోనే సంపద సృష్టించాలి. ఇందుకోసం కులవృత్తులను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వమే చేపపిల్లలను కొనుగోలు చేసి మత్స్యపారిశ్రామిక సంఘాల సమక్షంలో చెరువుల్లో విడుదల చేస్తుంది. అయితే గతంలో ఈ పంపిణీలో పలు అవకతవకలు జరిగినట్లు విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. పిల్లలు నాసిరకంగా ఉన్నాయని.. లెక్కల్లో తేడా ఉందని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం చేపపిల్లల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో గత అనుభవాలను తలచుకుంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యమైన చేపపిల్లలను చెరువుల్లో వదిలి తమ ఆర్థిక అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పంపిణీకి అధికారుల కసరత్తు
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తొందరగానే కురిశాయి. చెరువుల్లో నీరు చేరగానే చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, టెండర్ల ప్రక్రియతో ఆలస్యం అయింది. మత్స్యకారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని చేపపిల్లల పంపిణీకి కసరత్తు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,357 చెరువులు చేపపిల్లలు వదిలేందుకు అనువైనవిగా గుర్తించారు. 35–40, 80–100 సైజు మొత్తం 8,386.24 లక్షల చేపపిల్లలు, రొయ్యలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించారు. దీంతో జిల్లాల్లోని ప్రజా ప్రతినిధుల సమయం తీసుకొని చేపపిల్లలు చెరువుల్లో వదిలేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
గతంలో ఆరోపణలు
గతంలో ఉత్పత్తి చేసే కేంద్రాలు లేకపోయినా.. కొందరు కాంట్రాక్టర్లు వేరే హేచరీలను చూపించి కాంట్రాక్టు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం కాకుండా నాసిరకం పిల్లలు పంపిణీ చేశారని, దీంతో పలు చెరువుల్లో ఆరు, ఏడు నెలలు గడిచినా.. చేపలు 500 గ్రాముల సైజుకు కూడా రాలేదనే ఆరోపణలు మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి. అదేవిధంగా చేపపిల్లలను చెరువుల్లో విడిచే సమయంలో తక్కువ పిల్లలు పోసి లెక్కలు ఎక్కువ చూపించినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అయితే వీటిని పరిశీలించాల్సిన అధికారులు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం, ముడుపులు తీసుకొని చూసీ చూడనట్లు ఉన్నారనే ఆరోపణలు కూడా మత్స్యకారుల నుంచి వ్యక్తమయ్యాయి.
నాసిరకం చేపపిల్లలు.. లెక్కల్లో తేడాలు..
ఎదగని పిల్లలతో మత్స్యకారుల
ఇబ్బందులు
గత అనుభవాలతో మత్స్యకారుల
ఆందోళన
ప్రస్తుతం చేపపిల్లల ఉచిత పంపిణీకి
కసరత్తు
జిల్లా చెరువులు చేపపిల్లలు నిధులు
(లక్షల్లో) (రూ.లక్షల్లో)
మహబూబాబాద్ 1,233 421.68 492.38
జనగామ 732 272.72 319.42
జేఎస్ భూపాలపల్లి 837 276.47 276.50
ములుగు 470 157.55 172.42
వరంగల్ 703 190.06 193.08
హనుమకొండ 810 220.55 227.52
మొత్తం 4,785 1539.03 1681.32
నాణ్యత పరిశీలించాలి
ఆగస్టు నెలలో చేపపిల్లలు చెరువుల్లో పోస్తే వర్షం నీరు, పొలాల నుంచి వచ్చే మురుగు నీరు చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. పిల్లల ఎదుగుదల ఉంటుంది. కానీ ఇప్పుడు ఆలస్యం అయింది. అయినా పిల్లల నాణ్యతను పరిశీలించి చెరువుల్లో పోయాలి.
– కొత్తూరు రమేష్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చీఫ్ ప్రమోటర్
లెక్కలు సరిగ్గా చూడాలి
గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేపపిల్లలు నాసిరకంతోపాటు లెక్కల్లో కూడా తేడాలు వచ్చాయి. తక్కువ చేపపిల్లలు పోసి ఎక్కువ లెక్కలు చూపించారని ఆరోపణలు వచ్చాయి. ఈసారి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లెక్కల్లో తేడా రాకుండా చూడాలి.
– సింగాని అశోక్, మత్స్య పారిశ్రామిక సంఘం, మహబూబాబాద్

నాణ్యతపై నజర్

నాణ్యతపై నజర్