
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్రీల్
● పలు పాఠశాలల్లో వేధిస్తున్న
ఉపాధ్యాయుల కొరత
● ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారని ఆరోపణలు
● విద్యాపరంగా నష్టపోతున్న
విద్యార్థులు
‘మానుకోట మున్సిపాలిటీ పరిధి గాంధీపురం ఎంపీపీఎస్లో ఐదుగురు ఉపాధ్యాయుల్లో నలుగురు పదోన్నతులపై వెళ్లారు. ఉన్న ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. మొత్తం 54మంది విద్యార్థులకు చదువుతున్నారు. కాగా, హెచ్ఎం కాంప్లెక్స్ సమావేశాలు, జూమ్ మీటింగ్కు హాజరుకావడం, ఎండీఎం అప్డేట్ చేయడం, ఎఫ్ఆర్ఎస్ ఇలా రకరకాల విద్యా సంబంధమైన డ్యూటీలు వేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించి ఇతర పాఠశాలల నుంచి డిప్యుటేషన్ పై ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.’
మహబూబాబాద్ అర్బన్:
ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. కాగా అవసరం మేరకు ఆయా జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీలోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. కలెక్టర్ల ఆమోదంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గతంలో జూలై 15లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ తర్వాత పదోన్నతులు, బదిలీల అంశం తెరపైకి రావడంతో అనేక జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు పెండింగ్లో పడింది. పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో తాజాగా మరోసారి ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
ఆరోపణలు..
జిల్లాలో 676 ప్రైమరీ పాఠశాలలు ఉండగా.. 19,213 మంది విద్యార్థులు చదువుతున్నారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 5,354 మంది విద్యార్థులు చదువుతున్నారు. 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా 13,497 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 3,281 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాగా జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, జిల్లా విద్యాశాఖ నెల రోజుల క్రితం 84మంది ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసింది. అయితే ఎంఈఓలు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని, జాబితాను తప్పుల తడకగా రూపొందించారని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈసారైనా సక్రమంగా జరిగేనా..
ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల సర్దుబాటు మొదట జరిగిన జిల్లాలో పదోన్నతులపై సుమారు 90మంది ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. అదేవిధంగా సర్దుబాటు చేసిన డీఈఓ కూడా పదవీ విరమణ పొందారు. నూతనంగా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి సర్దుబాటు విషయ తలనొప్పిగా మారింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులను బోధించడానికి విద్యార్థులకు అనుగుణంగా మొత్తం నలుగురు ఉపాధ్యాయులతో ఒక హెచ్ఎం ఉండాలి. గత డీఈఓ, విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులు ఈసారి సరిదిద్దుకుంటారో లేదో వేచిచూడాలి. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో సర్దుబాటు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో మాదిరిగా ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో తప్పిదాలు జరగకుండా ఈసారి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తాం.
– దక్షిణామూర్తి, డీఈఓ

మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025