
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజామాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. మారుమూల ప్రాంతమైన కూనూర్లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరావు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తిరుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ప్రథమ స్థానంలో ఆదిలాబాద్,
మెదక్ జట్లు