
21న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలకవర్గ ఎన్నికకు ఈనెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహకార అధికారి ఎం. వాల్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 8,11, 12 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు, 21న పోలింగ్, పోలింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. ఫలితాల ప్రకటన తర్వాత మూడు రోజుల్లో ఆఫీస్ బేరర్స్ ఎన్నికల ఉంటాయని పేర్కొన్నారు. బ్యాంక్ పాలకవర్గంలో మొత్తం 12 మంది సభ్యులకు గాను ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఒక స్థానం, మహిళా కేటగిరీకి రెండు స్థానాలు, ఓపెన్ కేటగిరీకి 9 స్థానాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఓ సిటీ రోడ్డులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏవీవీ కళాశాలలో జరుగుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
అదుపు తప్పిన బైక్..
ఫర్టిలైజర్ నిర్వాహకుడి దుర్మరణం
హసన్పర్తి: బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామారం సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన సాంబశివరావు(46) స్థానికంగా లక్ష్మీ పేరుతో ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం శనిగరంనుంచి హనుమకొండ వైపునకు బయల్దేరాడు. రామారం వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో సాంబశివరావు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం మార్చురీలో భద్రపరిచిన సాంబశివరావు మృతదేహాన్ని ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబానికి తమ అసోసియేషన్ అండగా ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న తెలిపారు. నివాళులర్పించిన వారిలో లెక్కల పున్నంచందర్రెడ్డి ఉన్నారు.

21న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు