● పంట మార్పిడి ద్వారా ప్రయోజనం ● సేంద్రియ వ్యవసాయంతో నేల ఆరోగ్యం ● మిల్లెట్స్, పప్పు ధాన్యాలతో ఆదాయం ● వైఎస్సార్ సెంటినరీ హాల్లో జెడ్ఆర్ఈఏసీ సమావేశం
నంద్యాల(అర్బన్): ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసార పెంపుతో రైతులు అధిక దిగుబడులు పొందవచ్చని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. రైతులు మిశ్రమ పంటలను అవలంభించి ఆర్థిక స్థిరత్వాన్ని పొందాలన్నారు. బుధవారం వైఎస్సార్ సెంటినరీ హాల్లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ చెరుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథి కలెక్టర్ రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 3.35 లక్షల మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, స్థిరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక సాగు విధానాలు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఇచ్చే పంటలు, నీటి వనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ అందించి, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వా రా వారి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. భూమి సంరక్షణ, తక్కువ కాలంలో అధిక దిగుబడి సాధించే పంటల ఎంపిక, తక్కువ నీరు, ఎరువులతో అధిక లాభాలు అందించే విధానాల పై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ చెరుకూరిశ్రీనివాసరావు మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలన్నారు. బహుళ పంటల సాగు, మిశ్రమ పద్ధతుల ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగం అత్యంత కీలకమన్నారు. రసాయనాల ప్రభావం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఎన్జీరంగ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ మాట్లాడుతూ.. వ్యవసాయంలో సమస్యలను గుర్తించి ఆ దిశగా పరిశోధనలు, విస్తరణ అంశాలను బలోపేతం చేయాలన్నారు. ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జా న్సన్ మాట్లాడుతూ..మిల్లెట్స్ వినియోగాన్ని ప్రోత్సహి ంచాలన్నారు. అంతకుముందు వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెలకువలను రైతులకు వివరించారు. నాలుగు జిల్లాల వ్యవసాయాధికారులు వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, రవి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.


