● రెడ్డి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పెరియవరం గోపాల్రెడ్డి
ఉయ్యాలవాడ: రెడ్డి కులంలో చాలా సంఘాలు ఉన్నాయని, సంఘాలన్నీ సంఘటితం కావాల్సిన అవసరం ఉందని రెడ్డి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పెరియవరం గోపాల్రెడ్డి అన్నారు. ఈనెల 11వ తేదీన మహానందిలో చేపట్టిన ‘ఉరిమే ఉయ్యాలవాడ’ యాత్ర ఆదివారం ఉయ్యాలవాడకు చేరుకుంది. ఉయ్యాలవాడ బస్టాండు ఆవరణలో విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కళియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డిల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బీసీఎస్సార్ ఎయిడెడ్ పాఠశాలలో మాజీ గ్రామ సర్పంచ్ పోచా రాధాక్రిష్ణారెడ్డి, కోవెలకుంట్ల మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ బీఆర్ కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి ఫౌండేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పెరియవరం గోపాల్రెడ్డి, రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డిలు మాట్లాడుతూ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ప్రభుత్వం తరుపున నిర్వహించాలని పోరాటాలు చేయడం ద్వారానే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఉయ్యాలవాడలో నరసింహారెడ్డి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి, వర్థంతిలను ఘనంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. విగ్రహ ప్రతిష్ట కోసం నేతలు స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా సంక్షేమ సంఘం జాహ్నవిరెడ్డి, జేఏసీ మహిళా నాయకురాలు సరోజారెడ్డి, ఏపి మహిళా అధ్యక్షురాలు సుహాసినిరెడ్డి, కర్ణాటక రెడ్డి సంఘం జనసంఘ్ కోఆర్డినేటర్ మాధవరెడ్డి, లెక్కల కొండారెడ్డి, కావలి రెడ్డి ఫౌండేషన్ కృష్ణారెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్లు పల్లె మహేశ్వరరెడ్డి, బుడ్డా విష్ణువర్ధన్రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ పల్లె సుబ్బారెడ్డి, మండల రెడ్డి సంఘం నాయకులు మారంరెడ్డి లక్ష్మిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కర్నాటి రామకృష్ణారెడ్డి, గండా శివారెడ్డి, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


