ఆదోని రూరల్: తాటి చెట్టుపై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. మండలంలోని పెద్దతుంబలం గ్రామంలో ఈసంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని పెద్దతుంబలం గ్రామానికి చెందిన ఉసేని (35) తాటికాయలు కోసి విక్రయిస్తుంటాడు. ఇందులో భాగంగా బుధవారం గ్రామ సమీపంలో ఉన్న తాటి చెట్టును ఎక్కి తాటికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే చికిత్స నిమిత్తం బంధువులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా ఉసేనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె కౌసల్య వివాహం ఈనెల 12న ఆదివారం అదే గ్రామానికి చెందిన యువకుడితో జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు తండ్రి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపారు.


