శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని పొట్టి శ్రీరాములు చరిత్ర సంస్కృతి పురావస్తు శాఖ పీఠాధిపతి (డీన్)గా ప్రొఫెసర్ భూక్యా బాబురావు బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు ఈ నెల 1న తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు మునిరత్నం నాయుడు నుంచి ఉత్తర్వులను ప్రధాన కార్యాలయంలో అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. 1999లో సహాయ ఆచార్యులుగా శ్రీశైలం తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తూ 2021లో ఆచార్యులుగా పదవి పొందడంతో పాటు పీఠాధిపతిగా పనిచేశానని అన్నారు. రెండవసారి శ్రీశైలం పీఠాధిపతిగా అవకాశం కల్పించిన వర్సిటీ ఉపాధ్యక్షులు రిజిస్టార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
బీఎస్ఎన్ఎల్ ప్లాన్ గడువు పొడిగింపు
కర్నూలు(హాస్పిటల్): బీఎస్ఎన్ఎల్ ఫ్రీడల్ ప్లాన్ ఆఫర్ (4జీ సిమ్ కేవలం రూ.1..కే)ను ఈ నెల 30వ తేది వరకు పొడిగించినట్లు ఆ సంస్థ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫ్రీడల్ ప్లాన్ లేదా ఆజాది కా ఆఫర్ ద్వారా వినియోగదారులకు ఉచితంగా 4జి సిమ్ను ఇస్తూ కేవలం రూ.1 రీఛార్జి ద్వారా 30 రోజుల పాటు ప్రతిరోజూ 2జీబీ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చన్నారు. ఈ ఆఫర్ కొత్తగా సిమ్ తీసుకునే వారికి, బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యే వారికి వర్తిస్తుందని తెలిపారు. వినియోగదారులు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రం లేదా రిటైలర్ను సందర్శించి ఈ ఆఫర్ను పొందాలని ఆయన పేర్కొన్నారు.
నేడు న్యాయవాదుల నిరసన
కర్నూలు : అన్నమయ్య జిల్లా పిలేరు బార్ అసోసియేషన్ న్యాయవాది పూజారి ఎల్లయ్య హత్యను ఖండిస్తూ గురువారం న్యాయవాదులు నిరసన తెలపనున్నారు. కోర్టు విధులకు హాజరుకాకుండా నిరసన కార్యక్రమం చేపట్టాలని తీర్మానించినట్లు కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే పత్తికొండ బార్ అసోసియేషన్ సభ్యులు కూడా నేడు కోర్టు విధులకు గైర్హాజరు అవుతున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు మధుబాబు మరో ప్రకటనలో వెల్లడించారు.
యువతి అదృశ్యం
నందికొట్కూరు: జూపాడుబంగ్లా మండలం పి. లింగాపురం గ్రామానికి చెందిన అవిజ చిన్న నాగన్న కూతురు స్వాతి అదృశ్యమైంది. పట్టణంలోని ఓ ప్రవేట్ కళాశాలలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఈ అమ్మాయి ప్రతి రోజు ఇంటి ను ంచి వచ్చి తిరిగి వెళ్లేది. మంగళవారం సాయంత్రం ఇంటికి రాలేదని బుధవారం స్వాతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రామచంద్రయ్య తెలిపారు.
బావిలో పడి బాలుడి మృతి
సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్లో ఓ బాలుడు బావిలో పడి మృతిచెందాడు. బాధిత కుటుంబంలో ఈ ఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని తెలుగు (బెస్త) వీధిలో నివాసం ఉండే తెలుగు మద్దిలేటి, రంగవేణి దంపతుల ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతనం మొదటి కుమారుడు మధు (13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి గ్రామ చివర చెరువు దగ్గరున్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి తిరిగిరాలేదు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లిదండ్రులు మంగళవారం సాయంత్రం గాలించారు. బావి గట్టుపై కుమారుడి దుస్తులు కనిపించడంతో తీవ్ర ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో బుధవారం తెల్లవారుజామున స్థానికులు, మత్స్యకార జాలర్లు, పోలీసుల సాయంతో బావిలో గాలించారు. 11 గంటల సమయంలో బాలుడి మృతదేహం బయటపడింది. ఈతకు వెళ్లి కుమారుడు మృతి చెందడంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువుల బోరున విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చట్టాలు అమలు చేయాలి
కోవెలకుంట్ల: ఎస్సీ, ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి దళితులకు అండగా నిలవాలని మాలమహానాడు గ్రేటర్ రాయలసీమ అధ్యక్షుడు కోగిల ప్రసాద్ అన్నారు. బుధవారం కోవెలకుంట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా ఏ హక్కులు ఉన్నాయో వాటిని యథావిధిగా అమలు చేయాలన్నారు. ఎస్సీ కులంలోని 59 ఉప కులాలకు అన్ని విధాలా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.


