ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఆలూరు సమీపంలో ఘటన
ఆలూరు రూరల్: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఆలూరు సమీపంలోని హైవే 167లో బుధవారం 12 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని హులేబీడు గ్రామానికి చెందిన ప్యాసింజర్ ఆటో ఆలూరు నుంచి హులేబీడుకు వెళ్తోంది. గుంతకల్లు నుంచి ఆదోనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆలూరు సమీపంలో ఆటోను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా ప్రైవేటు ట్రావెల్ బస్సు వచ్చింది. దీనిని తప్పించే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ ఆటోను ఢీకొట్టడంతో ఆ వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. వారిని 108 ఆంబులెన్స్లో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మునెప్ప (59) అనే వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే మృతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు సంతానం. ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సులో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మన్మథ విజయ్ విలేకరులకు వెల్లడించారు.
ప్రమాదానికి గురైన ఆటో , కారణమైన ఆర్టీసీ బస్సు


