కర్నూలు: ఆరోగ్య సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్లో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి కబర్ధితో పాటు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టులో పనిచేసే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉద్యోగ రీత్యా అనేక ఒత్తిళ్లకు లోనవుతారని, వారు ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ మూసాహిద్ చౌదరి, డాక్టర్ సాత్వికతో పాటు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సరయు రెడ్డి, శశికిరణ్, డాక్టర్ మంజునాథ్, డాక్టర్ లక్ష్మి, ఏరియా జనరల్ మేనేజర్ ఖాదర్ బాషా, క్యాంప్ ఇన్చార్జి రంగారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. షుగర్, బీపీ, డెంటల్ పరీక్షలు, గుండెకు సంబంధించిన ఈసీజీ, 2డీ ఎకో టెస్టులతో పాటు సంపూర్ణ రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్యపరంగా అందించాల్సిన సేవలను సూచించారు.


