● చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త, వైస్చైర్మన్ హితవు
గోనెగండ్ల: ఎర్రబాడు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడమేకాక వైఎస్సార్సీపీ నేతలపై దుష్ప్రచారం చేయడం సరికాదని దేవాలయ ధర్మకర్త శ్రీరాములు, వైస్ చైర్మన్ రొగి రాముడు, అర్చకులు మనోహర్స్వామి, కమిటీ సభ్యులు రామచంద్ర గౌడ్, శివ అన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎర్రబాడు గ్రామంలో చెన్నకేశవ స్వామి ఉత్సవాల్లో చెన్నకేశవస్వామి రథోత్సవంతో పాటు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి కరపత్రాల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితర పేర్లు ముద్రించామన్నారు. ఈ కరపత్రిక చూసిన ఎమ్మెల్యే.. వైఎస్సార్సీపీ నేతల పేర్లు ఉన్నాయని, వాటిని తొలగించి కొత్తగా కరపత్రికలు కొట్టించాలని ఆదేశించగా ఇప్పుడు సమయం లేదని మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెబితే ఆయన వినిపించుకోలేదన్నారు. తర్వాత వేడుకలకు సహకరించాలని కోరేందుకు గోనెగండ్ల సీఐ వద్దకెళ్లితే సిబ్బంది లేరని చెప్పి వినోద కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇలా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకొని టీడీపీ నేతలు జరిపించే కార్యక్రమాలను యథావిథిగా నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి టీడీపీ నేతలు సమాధానం చెప్పకపోగా సీఐని కలిసి అనుమతి కొరలేదని మాపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. గ్రామంలో జరిగే ఉత్సవాలకు రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదన్నారు. జాతర అంటేనే అన్ని రాజకీయ పార్టీల నాయకులు వస్తారన్నారు. కార్యక్రమంలో ఎర్రబాడు గ్రామస్తులు పాల్గొన్నారు.


