ఆదోని సెంట్రల్: పట్టణంలోని శ్రీబాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాధికారి సుధాకర్ శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ పాఠశాలలో శుక్రవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా విద్యాధికారి స్పందించి శనివారం పాఠశాలకు చేరుకొని తరగతి గదులను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యం సరికాదని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు అరవింద్, చరణ్ లను పరామర్శించి వైద్యులనడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తర్వాత పాఠశాల నిర్వహణ, ప్రమాదానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాగా సదరు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు గౌస్, ఉమాకాంత్, జగన్ డీఈఓను కలిసి వినతి పత్రం అందించారు.


