మంత్రాలయం: నడిచే రాఘవేంద్రులుగా పేరుగాంచిన శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు మధ్యారాధన వేడుకలు ఆదివారం శ్రీమఠంలో వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో స్వామిజీ మధ్యారాధన వేడుకలు కనుల పండువగా సాగాయి. ముందుగా వేద పఠనంతో సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సుయతీంద్రతీర్థుల చిత్ర పటాన్ని బంగారు రథంపై శ్రీమఠం ప్రాంగణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు.


