ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం... నమ్మి ఓట్లు వేసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. గత ఎన్నికల సమయంలో డోన్ పాతబస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రేషన్కార్డు, ఆధార్కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతి కుటుంబానికి ఒకటిన్నర సెంటు చొప్పున ఇంటిస్థలం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతున్న అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా డోన్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పైగా జగనన్న కాలనీల్లో సౌకర్యాల కల్పనకు నయాపైసా ఖర్చు చేయలేదు. టీడీపీ నేతల ‘ఇంటి’ గుట్టు బట్టబయలు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పాలన అంటూ నిట్చూర్చుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందని, అప్పట్లో మంజూరైన ఇళ్లు, ఇంటి స్థలాలు, ఏర్పాటైన కాలనీలను గుర్తు చేసుకుంటున్నారు.
80 వేల కుటుంబాలకు కుచ్చుటోపీ
డోన్ నియోజకవర్గంలో డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్యాపిలి మేజర్ గ్రామ పంచాయతీ ఉంది. నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 80 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒకటిన్నర సెంటు ఇస్తామని తెలుగుదేశం పార్టీ పేరుతో ఆ పార్టీ నేతల ఫొటోలను ముద్రించి కార్డులు ఇంటింటికీ పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఈ కార్డులను పట్టించుకోవడం లేదు. ప్రజలు వీటిని టీడీపీ నేతలకు చూపిస్తే వాటిని తీసుకుని చెత్తబుట్టల్లో వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ కార్డులు ఎవరికీ కనిపించకుండా దహనం చేస్తున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి 80 వేల కుటుంబాలకు టీడీపీ నేతలు కుచ్చుటోపీ పెట్టారని ప్రజలు మండిపడుతున్నారు.
వైఎస్సార్ హయాంలో డోన్ నియోజకవర్గంలో ఏడు వేల పక్కాగృహాలను మంజూరు చేశారు. పలు కాలనీల ఏర్పాటుకు ఉదారంగా నిధులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో 10వేల పక్కాగృహాలను మంజూరు చేసి జగనన్న కాలనీల ఏర్పాటు చేశారు. ఇప్పుడు పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు.
– కీర్తి, బేతంచెర్ల
చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అర్హులైన ఒక్క నిరుపేద కుటుంబానికి అంగుళ స్థలం కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– వరలక్ష్మి, ఏనుగుమర్రి, ప్యాపిలి మండలం.
ఒకటిన్నర సెంటు ఇస్తామని
టీడీపీ నేతల హామీ
అధికారంలోకి వచ్చాక
గజం స్థలం కూడా ఇవ్వని వైనం
అన్నీ అబద్ధాలు చెప్పారని
ప్రజల ఆగ్రహం


