పార్టీ మారుతారా.. డీలర్షిప్ వదులుకుంటారా!
డోన్: అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, ఆగడాలు రోజురోజుకు మితుమీరుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు, పోలీసులు సైతం వారికి జీహుజూర్ అంటున్నారు. డోన్ పట్టణంలో 20 రోజులుగా వైఎస్సార్సీపీ మద్దతుదారులైన డీలరును తీవ్రంగా వేధిస్తున్నారు. పట్టణంలో మాజీ కౌన్సిలర్ ధారా ప్రతాప్రెడ్డి కుటుంబం రాజకీయంగా పేరుంది. అతని కుమారుడు ధారా హరినాథ్రెడ్డి 31వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్గా విజయం సాధించినా, స్థానిక ఎన్నికల అనంతరం అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేసి తమ వైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలోనే ధారా ప్రతాప్రెడ్డి కుమార్తె ధారా లావణ్య ప్రస్తుతం 17వ రేషన్ దుకాణం డీలర్గా కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి మద్దతుదారులు కావడంతో అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు కొనసాగుతున్నాయి. టీడీపీలో చేరుతారా.. డీలర్షిప్ను వదులుకుంటారా.. అని తీవ్ర ఒత్తిళ్లకు పాల్పడినట్లు సమాచారం. వారి ప్రయత్నం ఫలించకపోవడంతో చివరకు డీలర్పై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, బెదిరింపులకు దిగారు. రాజకీయ ఒత్తిళ్లతో ఈనెల 3వ తేదీన రెవెన్యూ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి 600 క్వింటాళ్ల బియ్యం అలాట్మెంట్ ఉన్నా 128 కేజీలు తక్కువ ఉన్నట్లు పంచనామా చేశారు. డీలర్ వద్ద ఉన్న డిజిటల్ ఈ –పాస్ మిషన్ను బలవంతంగా రెవెన్యూ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయమై తనకు రికార్డు పరంగా రాసి ఇవ్వాలని డీలర్ ఒత్తిడి తేగా రేపు, మాపు అంటూ దాట వేస్తూ వచ్చారు. అయితే శనివారం అర్ధరాత్రి రహస్యంగా దుకాణం తలుపులు పగులగొట్టి రేషన్ సరుకులన్నీ రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ విషయం తెలిసి డీలర్ లావణ్య అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే సరుకులు తామే స్వాధీనం చేసుకున్నామని, వెంటనే డీలర్షిప్నకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బెదిరిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని డీలర్ లావణ్య జిల్లా కలెక్టర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. మండలంలోని గుమ్మకొండ గ్రామానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు పోలీసు, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమను అనేక రకాలుగా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు.
వైఎస్సార్సీపీ మద్దతుదారు డీలరుపై
టీడీపీ కక్ష సాధింపు చర్యలు
20 రోజులుగా ఈ – పాస్ మిషన్
ఇవ్వకుండా వేధింపులు
అధికార పార్టీ నేతలకు
వంత పాడుతున్న పోలీసు,
రెవెన్యూ యంత్రాంగం
పార్టీ మారుతారా.. డీలర్షిప్ వదులుకుంటారా!


