ప్రతి కుటుంబంలో శాంతి వెల్లివిరియాలి
● బిషప్ గోరంట్ల జ్వాన్నేష్
కర్నూలు (టౌన్): ప్రతి కుటుంబంలో శాంతి వెల్లివిరియాలని కర్నూలు డయాసిస్ బిషప్ గోరంట్ల జ్వా న్వేష్ అన్నారు. గురువారం స్థానిక నంద్యాల చెక్పోస్టులోని పరిశుద్ద లూర్డుమాత కథడ్రల్ బిషప్ చర్చిలో నూతన సంవత్సరం పురస్కరించుకొని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా బిషప్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలన్నారు. అనంతరం చర్చి సభ్యులకు బిషప్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఫాదర్లు ప్రతాప్ రెడ్డి, జోజి రెడ్డి, జాన్ డేవిడ్, ప్రవీణ్, రాజశేఖర్, సిస్టర్లు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కల్లూరు: ఉలిందకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్డుపై టిడ్కో బిల్డింగ్స్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉలిందకొండ ఎస్ఐ ధనుంజయ తెలిపిన వివరాలు... రింగ్ రోడ్డుపై రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరచినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని గుర్తించిన యెడల ఉలిందకొండ పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ ధనుంజయ తెలిపారు.
నందికొట్కూరు:నల్లమల ఘాట్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నందికొట్కూరుకు చెందిన స్నేహితులు భరత్(24), ఠాగూరు, వడ్డే గణేష్, బాషా పనిమీద కారులో విజయవాడకు బయలుదేరారు. కాగా మార్గమధ్యలో నల్లమల ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న భరత్, ఠాగూర్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న నందికొట్కూరు వాసులు గుర్తించి వారి వాహనంలోనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా భరత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఠాగూరుకు తలకు తీవ్ర గాయం కావడంతో కర్నూలు ఆస్పత్రికి రెఫర్ చేశారు. బాషా ఆత్మకూరులోనే కారు దిగిపోగా, గణేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పట్టణంలోని బైరెడ్డి నగర్కు చెందిన అశోక్ ఆచారి, ఉమా దంపతుల కుమారుడు భరత్ స్థానిక బైరెడ్డి కాంప్లెక్స్లో బంగారు షాపు నడుపుతున్నాడు. మృతదేహం ప్రభుత్వ వైద్యశాలలో మార్చరీలో ఉంచారు. స్నేహితులతో కలసి విజయవాడకు వెళ్తున్నట్లు చెప్పిన కుమారుడు విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబీకులు విలపిస్తున్నారు.
ప్రతి కుటుంబంలో శాంతి వెల్లివిరియాలి


