మల్లన్నకు వెండి రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: పవిత్రశైవక్షేత్రమైన యాగంటిలో సోమవారం స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ నిర్వహించారు. ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం అర్చన తదితర పూజలు జరిగాయి. సాయంత్రం ఆలయం ఆవరణలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, యాగంటిపల్లె గ్రామ ఉపసర్పంచ్ మౌలిశ్వరరెడ్డితో పాటు అలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జనవరి 8, 9 తేదీల్లో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఇందిరాశాంతి తెలిపారు. సోమవారం రాయలసీమ విశ్వవిద్యాలయంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను వీసీ, క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ వి.వెంకట బసవరావు ఆవిష్కరించారు. ‘21వ శతాబ్ధి మహిళా సాహిత్యం–సమాలోచన’ అంశంపై సదస్సు జరుగుతుందన్నారు. పరిశోధకులు తమ వ్యాసాన్ని జనవరి 1వ తేదీలోగా పంపాలని, మరిన్ని వివరాలకు 97053 83422 నంబర్ను సంప్రదించాలన్నారు.
మల్లన్నకు వెండి రథోత్సవం


