తాలూకా యూనిట్లకు ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ఆరు తాలూకా యూనిట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు విద్యాసాగర్, రమణ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వి.జవహర్లాల్ తెలిపారు. కోడుమూరు, ఆలూరు, ఆదోని, కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు తాలూకా యూనిట్లకు ఎన్నికల నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం ఆదేశించినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని తాలూకాల్లో నిబంధనల ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా ధృవీకరించిన తర్వాత జిల్లా సంఘం తాలూకాలకు ఎన్నికల అధికారులను నియమిస్తుందన్నారు.
గురుకుల విద్యార్థులకు ఉచిత లాంగ్టర్మ్ కోచింగ్
కర్నూలు(అర్బన్): సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల్లో ఇంటర్మీడియట్ చదివి, నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ను ఉచితంగా అందిస్తున్నట్లు ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో శిక్షణా తరగతులు ప్రారంభమైనట్లు ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆయా గురుకులాల ప్రిన్సిపాళ్లు, జిల్లా డీసీఓలను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 7569226400, 8978222576 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఔషధ నియంత్రణ శాఖ ఏడీగా హరిహరతేజ
కర్నూలు(హాస్పిటల్): ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా డి.హరిహర తేజ గురువారం కర్నూలులో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి ఏడీగా పదోన్నతి పొందిన ఆయనకు ఆ శాఖ డైరెక్టర్ జనరల్ కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇటీవల ఏడీగా నియమితులైన రమేష్రెడ్డి బదిలీపై కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఆయన బదిలీ నియమ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, వెంటనే రద్దు చేయాలని అందులో కోరినట్లు సమాచారం. దీంతో గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను మార్చారు. ఈ మేరకు గతంలో ఏడీగా పనిచేసిన నెల్లూరుకు రమేష్రెడ్డిని తిరిగి బదిలీ చేశారు. నెల్లూరుకు ఏడీగా పదోన్నతిపై వెళ్లిన హరిహరతేజను కర్నూలుకు బదిలీ చేశారు. కాగా హరిహరతేజ గతంలో మూడేళ్లకు పైగా జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన విషయం విదితమే. ఆయన ఏడీగా పదోన్నతి పొంది తిరిగి కర్నూలు జిల్లాకు రావడం విశేషం.
కిక్కు దిగేలా జరిమానా
కర్నూలు: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 17 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ జేఎఫ్సీఎం కోర్టులో న్యాయమూర్తి అనిల్కుమార్ తీర్పు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో కర్నూలు సి.క్యాంప్ సెంటర్లో బుధవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మోతాదుకు మించి 17 మంది మద్యం సేవించగా వారిని గురువారం కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.70 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు.
గిరిజన పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు
కర్నూలు(అర్బన్): దర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా జయంతి, జన్ జాతీయ గౌరవ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లాలోని గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.సురేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను ఈ నెల 1 నుంచి 15వ తేది వరకు నిర్వహిస్తామన్నారు. ఈ నే పథ్యంలోనే కర్నూలులోని బాలికల గురుకులం, బాలుర ఆశ్రమ పాఠశాలలను సందర్శించినట్లు తెలిపారు. ఆలూరు, తుగ్గలి ప్రాంతాల్లోని గిరిజన విద్యాసంస్థల్లోనూ ఈ పోటీలను నిర్వహించామన్నారు. విద్యార్థుల్లోని సృజనాత్మకశక్తిని వెలికితీ సేందుకు పోటీలు ఉపయోగపడుతాయన్నారు.
తాలూకా యూనిట్లకు ఎన్నికలు


