కన్నీటి దిగుబడి!
కర్నూలు(అగ్రికల్చర్): పొలంలో విత్తనం వేసినప్పటి నుంచి పంట పండించే వరకు రైతులు ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చాక దానికి విలువ లేక లబోదిబోమంటున్నారు. మార్కెట్లో కనీసం మద్దతు ధర కూడా లభించకపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాలో 16,165, నంద్యాల జిల్లాలో 2,01,057 చొప్పున 2,17,222 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. విత్తనం వేసినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల డీజల్ ఇంజిన్లు అమర్చుకుని సాగునీటిని అందించారు. ఇందుకోసం ఎకరానికి రూ. 5 వేలు అదనపు భారం పడింది. అవసరం లేని సమయంలో వర్షాలు కురవడం, ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో కంకి నిండా గింజ రాలేదు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే 20 నుంచి 22 క్వింటాళ్లకే పరిమితమయ్యాయి.
మిగిలింది నష్టమే!
మొక్కజొన్న సాగులో రాణించాలంటే క్వింటాకు కనీసం రూ.2600 వరకు ధర ఉండాలి. ప్రస్తుతం మద్దతు ధర రూ.2400 ఉంది. మార్కెట్లో మాత్రం రూ.1400 నుంచి రూ.1800 వరకు మాత్రమే ధర వస్తోంది. పంట దిగుబడులు మార్కెట్లోకి రాకముందు క్వింటాకు రూ.2000 నుంచి రూ.2200 వరకు ధర లభించింది. దిగుబడులు మార్కెట్లోకి రావడం మొదలైన తర్వాత ధర పడిపోయింది. క్వింటాపై రైతులు రూ.600 నుంచి రూ.1000 వరకు నష్టపోతున్నారు. పెట్టుబడి వ్యయం ఎకరాకు రూ.30 వేల వరకు వస్తోంది. మద్దతు ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి వస్తుంది. లేదంటే నష్టమే మిగులుతోంది. నాలుగైదు నెలల పాటు కష్టించిన రైతుకు మిగులు సున్నానే. ఽమొక్కజొన్న రైతు ఇంత భారీగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది.
నకిలీలతో నట్టేట మునిగిన రైతులు
కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నకిలీల బెడద పెరిగిపోయింది. ప్రధానంగా నంద్యాల జిల్లాలో మొక్కజొన్నలో విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. మామూలుగా అయితే మొక్కజొన్నలో గరిష్టంగా కంకులు మాత్రమే వస్తాయి. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు సబ్ డివిజన్లలో ఒక్క మొక్కకు ఐదారు కంకులు వచ్చాయి. ఒక్క కంకికి కూడా గింజలు రాలేదు. వీటిని చూస్తే ఎవ్వరికై న నకిలీ విత్తనాల ప్రభావమేనని స్పష్టమవుతుంది. కాని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం ‘అవి నకిలీ విత్తనాలు కాదు... అధిక వర్షాల వల్ల ఇలా జరిగింది’ అని చెప్పారు. నకిలీ విత్తనాలపై ఒక్క నందికొట్కూరు సబ్ డివిజన్లో 36 ఫిర్యాదులు వచ్చాయి.
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పంటలకు మద్దతు ధర లేని సందర్భాల్లో ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో పంటలకు మార్కెట్లో ధర పెరిగేది. మొక్కజొన్న, వరి తదితర పంటల కోతలకు ముందే రైతు భరోసా కేంద్రాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రైతులకు ఊరట లభించేది.
ప్రస్తుతం ఇలా..
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంటలకు ధరలు పడిపోయాయి. నష్టం వచ్చి రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటుండగా వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పౌరసరఫరాల సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు లేవు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సన్న రకాలు సాగు చేస్తారని, వీటికి ధర బాగుంటుందని ప్రభుత్వానికి పౌరసరఫరాల సంస్థ ప్రభుత్వానికి నివేదించంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవీ కష్టాలు..
పంట కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా మోంథా తుపాన్ ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు.
రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతున్నాయి.
కోతకు వచ్చిన మొక్కజొన్న పైరు వర్షానికి నేలవాలడంతో రైతులకు కష్టాలు తప్పలేదు.
మొక్కజొన్న రైతుకు లభించని ‘మద్దతు’
మార్కెట్లో అరకొర ధర
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
కొనుగోలు కేంద్రాలు లేక
నష్టపోతున్న రైతులు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
