కృష్ణగిరి: గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి డోన్కు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్కు కోయిలకొండ గ్రామ సమీపాన రంధ్రం పడి నీరు వృథాగా పోతోంది. నెల రోజులుగా పైప్లైన్కు రంధ్రం పడినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీరు గ్రామానికి చెందిన చెరువు మాధవకృష్ణ పొలంలోకి వెళ్తున్నాయి.
చివరి మజిలీకి దారి కష్టాలు
కృష్ణగిరి: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామంలో ముస్లింలకు సంబంధించిన శ్మశానవాటికకు వెళ్లే దారిలో హంద్రీ నది ఉండటంతో రాకపోకలు సాగించే పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. హంద్రీ నదిలో పారే నడుము లోతు నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అవతలి ఒడ్డున అంతిమ సంస్కారాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ హంద్రీపై రూ. 7.95 కోట్లతో వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శంకుస్థాపన చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం రావడంతో వంతెన గురించి పట్టించుకోలేదు. దీంతో ముస్లిలు, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.
హాలహర్వి: మండలంలోని నిట్రవట్టి గ్రామం నుంచి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో 40 కుటుంబాల ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి, బెంగళూరు పట్టణాలకు ఆల్విన్ (టిప్పర్) వాహనంలో పిల్లాపాపలతో కలిసి వలస వెళ్లారు. గ్రామాల్లో సాగుచేసిన పంటలు వర్షాల ధాటికి నష్టం రావడంతో రోజూ కురుస్తున్న వర్షాలకు రబీ సీజన్లో వేసిన పప్పుశనగ, జొన్న, వాము పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో చేసేదేమి లేక స్థానికంగా పనులు లేక వలస వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు, రైతులు తెలిపారు. స్థానికంగా ఉపాధి పనులు కల్పిస్తే ఇక్కడే పనులు చేసుకునేవారమని వారు చెప్పారు.
శ్రీగిరి కిటకిట
శ్రీశైలంటెంపుల్: కార్తీకమాసం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీగిరికి తరలివచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మల్లన్న దర్శనానికి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పలువురు భక్తులు కార్తీకదీపారాధన చేసుకుని ప్రత్యేక నోములు నోచుకున్నారు. కార్తీక దీపారాధనకు దేవస్థానం విస్త్రత ఏర్పా ట్లు చేసింది. భక్తుల రద్దీతో ఆలయ పురవీధులన్నీ కిటకిటలాడాయి.
కుందూ నదికి పోటెత్తిన వరద
కోవెలకుంట్ల: స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్తోపాటు ఎగువ ప్రాంతాల్లో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు, పొలాల్లోని నీరంతా కుందూలోకి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో నదికి అనుసంధానంగా ఉన్న కప్పల పాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పరీవాహకంలో ఉన్న వరి పైర్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పంట నీట మునిగింది.
గాజులదిన్నె ప్రాజెక్టు పైప్లైన్కు రంధ్రం
గాజులదిన్నె ప్రాజెక్టు పైప్లైన్కు రంధ్రం


