
శ్రీజోగులాంబకు పట్టువస్త్రాల సమర్పణ
కర్నూలు(సెంట్రల్): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తరపున అలంపూర్లో వెలసిన జోగులాంబా సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల కు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం ఆమె అలంపూర్కు చేరుకొని తొలుత బాలబ్రహ్మేశ్వ ర స్వామికి అభిషేకం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు కలెక్టర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్కు వేదపండితులు వేదాశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలెక్టర్ వెంట దేవదాయ శాఖ ఏసీ బి.సుధాకరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ముగ్గురు సీఐలకు స్థానచలనం
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలు అర్బన్ తాలూకాకు ఎస్బీలో పనిచేస్తున్న తేజమూర్తిని నియమించి అక్కడున్న శ్రీధర్ను ఫ్యాక్షన్ జోన్కు బదిలీ చేశారు. అలాగే కర్నూలు ఫ్యాక్షన్ జోన్లో పనిచేస్తున్న చిరంజీవి ఖాళీగా ఉన్న ఎమ్మిగనూరు రూరల్ పీఎస్కు నియమితులయ్యారు. అక్కడున్న మధుసూదన్రావు నెల రోజుల క్రితం డీఎస్పీగా పదోన్నతిపై వెళ్లారు. ఇదిలాఉంటే కర్నూలు అర్బన్ తాలూకా, ఎమ్మిగనూరు రూరల్ తాలూకా పోలీస్స్టేషన్ల పోస్టింగుల కోసం అధికారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శ్రీధర్ను కర్నూలు రెండో పట్టణ స్టేషన్కు, అక్కడున్న నాగరాజరావును కర్నూలు అర్బన్ తాలూకాకు నియమించేందుకు మంత్రి అంగీకరించినప్పటికీ చివరి నిమిషంలో సమీకరణలు మారి తేజమూర్తి నియమితులయ్యారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్కు కూడా ముగ్గురు ఇన్స్పెక్టర్లు పోటీ పడ్డారు. జిల్లా పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఓ అధికారికి టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లేఖతో చిరంజీవి ఎమ్మిగనూరు రూరల్ పోస్టింగ్ దక్కించుకున్నట్లు సమాచారం.
బిట్కాయిన్ పేరుతో బురిడీ
కర్నూలు: బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మబలికి ఓ మహిళను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. స్థానిక గణేష్ నగర్లో నివాసముంటున్న ప్రసన్న రాణికి అపరిచితుడు ఫోన్ చేసి బిట్ కాయిన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. దీంతో ప్రసన్నరాణి స్పందించి అతడు చెప్పిన బ్యాంకు ఖాతాకు ఫోన్పే ద్వారా రూ.90 వేలు జమ చేసింది. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పీజీ రెండో విడత ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
కర్నూలు కల్చరల్: ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద రెండో విడత పీజీ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 4వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, వెబ్ కౌన్సెలింగ్కు ఫీజు చెల్లింపు, 5వ తేదీ వరకు అప్లోడెడ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 1 నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం, 6వ తేదీన వెబ్ఆప్షన్ల మార్పు, 8వ తేదీన సీట్ల కేటాయింపు, 8 నుంచి 11వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయడం, 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని షెడ్యూల్లో ప్రకటించారు.
పీహెచ్సీలలో తాత్కాలిక వైద్యులతో సేవలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు సమ్మె చేస్తున్న నేపథ్యంలో వారి స్థానంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శాంతికళ తాత్కాలికంగా వైద్యులను సర్దుబాటు చేశారు. మొ త్తం 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు మెడికల్ కళాశాలలోని పీజీ వైద్యులు, సీహెచ్సీ వైద్యులు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లను సర్దుబాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఆయా పీహెచ్సీలకు వెళ్లి రోగుల కు సేవలు అందించాలని, లేకపోతే తగిన చర్య లు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.