
పల్లెల్లో వైద్యం.. అందనంత దూరం!
● సమ్మె చేస్తున్న పీహెచ్సీ వైద్యులు
● ఓపీ సేవల బహిష్కరణ
● ఫార్మాసిస్టులు, నర్సులతో చికిత్స
కర్నూలు(హాస్పిటల్): గ్రామీణ ప్రజలకు ఏదైనా అస్వస్థత చేకూరితే స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే దిక్కు. అలాంటి వైద్యాలయాల్లో వైద్యం అందించే డాక్టర్ స్టెతస్కోప్ ముట్టడం లేదు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు అత్యవసరం మినహా ఓపీ కేసులు చూడబోమని ప్రకటించారు. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి వారు ఓపీ సేవలను బహిష్కరించారు. కేవలం అత్యవసర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. కొన్నిచోట్ల ఓపీ రోగులకు చికిత్స చేసినా ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. తమ నిరసన ప్రజలపై కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాత్రమేనని, కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ తాము ప్రజా సేవకు వెనుకడుగు వేయలేదని, అయినప్పటికీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను మరుగున పరుస్తూనే ఉందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సమ్మెతో ఓపీ రోగులకు అక్కడ ఉన్న ఫార్మాసిస్టులు, నర్సులే చికిత్స చేసి లక్షణాలను బట్టి మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన తమకు స్వయంగా వైద్యులు చూడలేదన్న అసంతృప్తి రోగుల్లో కలుగుతోంది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని
అధికారులు
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తాము సమ్మె చేయబోతున్నట్లు ఈ నెల 24వ తేదీనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓలను కలిసి సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. తమకు పీజీలు, హౌస్సర్జన్లను పంపితే పీహెచ్సీలకు పంపిస్తామని మాత్రమే ప్రభుత్వ కేఎంసీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లకు లేఖలు రాసినట్లు సమాచారం. వారిని పంపితే ఆసుపత్రి నిర్వహణ కష్టమవుతుందని అధికారులు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం నుంచి వైద్యులు ఓపీ సేవలు బహిష్కరించడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎస్సీ నిబంధనల మేరకు వైద్యులు సమ్మె చేయడానికి వీలులేదని, అది నేరం అవుతుందని, ఈ మేరకు వైద్యులకు సోమవారం నోటీసులు పంపించారు. వెంటనే సమ్మె విరమించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించాం. అయినా కూడా ఏ ఒక్కరూ స్పందించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధమయ్యాం. ఇందులో భాగంగా సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేశాం. మంగళవారం నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నాం. ఇప్పటికే అఫీషియల్ వాట్సాప్ గ్రూపు నుంచి నిష్క్రమించాం. జూమ్ కాన్ఫరెన్స్లకు హాజరుకావడం లేదు.
–డాక్టర్ రఘురామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ పీహెచ్సీ డాక్టర్స్ అసోసియేషన్, కర్నూలు

పల్లెల్లో వైద్యం.. అందనంత దూరం!

పల్లెల్లో వైద్యం.. అందనంత దూరం!