
సచివాలయ ఉద్యోగుల ఉద్యమ బాట
కర్నూలు(అర్బన్): గ్రామ/ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిభారాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సర్వేల పేరుతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు శాంతియుత నిరసన కార్యాక్రమాలకు సచివాలయ ఉద్యోగులు శ్రీకారం చుట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నింటినీ పారదర్శకంగా ప్రజల ముంగిటికే చేర్చిన వలంటీరు వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే గతంలో వలంటీర్లు నిర్వహించిన బాధ్యతలను ప్రస్తుతం గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయించేందుకు నిర్ణయం తీసుకుంది. మనమిత్ర – వాట్సాప్ ఈ గవర్నెన్స్ పేరుతో ఇంటింటికి వెళ్లి యాప్లో ఉన్న పౌర సేవలను ఇళ్ల యజమానులకు వివరించి వారిని భాగస్వామ్యులను చేయాలనే చర్యలను చేపట్టింది. ఇందుకు గ్రామ/ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వినియోగించుకునేందుకు ఆదేశాలను జారీ చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీరును నియమించి క్లస్టర్గా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు నాలుగైదు క్లస్టర్ల బాధ్యతలను ఒక సచివాలయ ఉద్యోగికి కేటాయించి సమాచార సేకరణ, ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మనమిత్ర వాట్సాప్ లోని మొత్తం 709 సర్వీసుల్లో ప్రతి ఉద్యోగి ఒక్క సర్వీస్ అయినా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ‘ మనమిత్ర ’ సర్వే వల్ల తమ ఆత్మగౌరవం దెబ్బ తింటుందని సచివాలయ ఉద్యోగులు ఉద్యమ బావుటా ఎగుర వేసేందుకు సిద్దం అయ్యారు.
సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సర్వేలు ..
గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగులు రెగ్యులర్గా తమ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న విధులతో పాటు అనేక రకాల సర్వేలను ఇళ్ల వద్దకు వెళ్లి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కౌశలం, బయోమెట్రిక్ అప్డేషన్, సిటిజన్ ఈకేవైసీ, పాపులేషన్ మేనేజ్మెంట్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, చైల్డ్ ఆధార్, ఫ్యామిటీ డీటైల్స్, మోబైల్ నెంబర్ అప్డేట్, ఫ్యామిలీ మైగ్రేషన్, అదర్ డిపార్టుమెంట్ ఈకేవైసీ, ఆధార్ సీడింగ్ ఫర్ వాహనమిత్ర, నాన్ ఏపీ రెసిడెంట్ తదితర సర్వేలను ఇంటింటికి తిరిగి చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ సర్వేను కూడా ఖచ్చితంగా చేయించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఉద్యమ బాట పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బలవంతంగా సర్వీసులను నమోదు చేయాలనే ఆదేశాల వల్ల ఉద్యోగులు అనేక రూపాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తమ ఆత్మ గౌరవం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పని పరిస్థితుల్లో విధులు బహిస్కరించేందుకు కూడా వెనుకాడమని వారు హెచ్చరిస్తున్నారు.
ఉద్యమానికి శ్రీకారం
సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలోనే ఉద్యోగులు ఈ నెల 6వ తేదినే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని ఉద్యోగులు ముందుగా నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అలాగే తమ పరిధిలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. తమ ఆవేదన పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఏపీవీడబ్ల్యూఎస్ఈ జేఏసీ పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
వలంటీర్ల బాధ్యతలను
అప్పగించడంపై ఆందోళన
ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు
సర్వత్రా నిరసన
ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో
విధులకు హాజరైన ఉద్యోగులు
ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు
వినతి పత్రాలు