
యూరియా, ఉల్లిపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
● కర్నూలు కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక
కర్నూలు (సెంట్రల్): యూరియా, ఉల్లిపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ విక్రాంత్పాటిల్ హెచ్చరించారు. కలెక్టరేట్లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉల్లికి ప్రభుత్వం నిర్దేశించిన కేజీ రూ.12 ప్రకారం కచ్చితంగా కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ముందుగా ట్రేడర్స్ ద్వారా వేలం జరుగుతుందని, వారు రూ.12 కంటే తక్కువగా కొనుగోలు చేస్తే తక్కువైన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఒకవేళ ట్రేడర్ కేజీ ఉల్లిని రూ.7కు కొనుగోలు చేస్తే తక్కువైన రూ.5ను ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఇందుకోసం రైతుల నుంచి ఆధార్ నంబర్, బ్యాంక్ పాస్బుక్, భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకుంటున్నట్టు చెప్పారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ఇప్పటికే 3,200 టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రెండు రోజుల్లో 2,600 టన్నులు రానున్నట్టు తెలిపారు. యూరియాను పక్కదారి పట్టించిన మూడు షాపుల లైసెన్స్లు రద్దు చేశామని, 13 మందిపై 6ఏ కేసులు, ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. నాలుగు షాపులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. యూరియా బదులుగా నానో యూరియా వాడాలని రైతులకు కలెక్టర్ సూచించారు. ఎస్పీ విక్రాంత్పాటిల్ మాట్లాడుతూ.. అధిక ధరకు యూరియా అమ్మేవారిపైన, తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల నుంచి అక్రమంగా సరఫరా చేసే వారిపైన 5 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అన్ని సరిహద్దు చెక్పోస్టులను అప్రమత్తం చేసి పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్, విజిలెన్స్, వ్యవసాయ అధికారులతో తనిఖీలు చేయిస్తున్నట్టు చెప్పారు.