
బస్సుల కోసం విద్యార్థులు, అధ్యాపకులు నిరీక్షణ
హొళగుంద: స్థానిక జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు, లెక్చరర్లు సోమవారం ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. సాయంత్రం కళాశాల తరగతులు ముగిసిన తరువాత ఆదోని మార్గంలో హెబ్బటం, లింగంపల్లి, వందవాగిలి తదితర గ్రామాలకు చెందిన దాదాపు 30 మందికి పైగా విద్యార్థులతో పాటు ఆదోనికి వెళ్లే లెక్చరర్లు కళాశాల వద్ద బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతిరోజు ఈ మార్గంలో తిరుగుతున్న టెన్ సింగిల్, కోగిలతోట సర్వీస్ బస్సులు సోమవారం మరమ్మతులకు గురై తిరగలేదు. దీంతో కాలేజీ వదిలిన తర్వాత విద్యార్థులు చీకటి పడినా బస్సు కోసం అక్కడే ఉండాల్సి వచ్చింది. 7 గంటల తరువాత బస్సు రావడంతో ఎట్టకేలకు విద్యార్థులు తమ గ్రామాలకు బయలుదేరారు.
ఈ సమస్య చాలా సార్లు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని హొళగుంద–ఢణాపురం రోడ్డు దారుణంగా ఉండడంతో బస్సులు చెడిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. లింగంపల్లికి చెందిన విద్యార్థులు లింగంపల్లి క్రాస్లోనే దిగి అక్కడి నుంచి గ్రామం చేరుకోవడానికి దాదాపు రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుందని ఇలా చీకటి పడినా బస్సులు రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సకాలంలో బస్సులు లేకపోవడంతో ఉదయం వేళ విద్యార్థులు కొన్ని తరగుతులు హాజరు కాలేకపోతున్నారు. ఆర్అండ్బీ, ఆర్టీసీ అధికారులు స్పందించి రోడ్డును బాగు చేసి వేళకు బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కుక్కకు మత్తు బిస్కెట్లు వేసి.. ఇంటి తాళాలు పగులగొట్టి
ఆదోని అర్బన్: పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని సింహపురి ఎస్టేట్లో చోరీ జరిగింది. కోసిగి పీహెచ్సీలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న వంశీకృష్ణ శనివారం ఇంటికి తాళాలు వేసి గుంతకల్లులో ఉన్న తన భార్య వద్దకు వెళ్లారు. కాపౌండ్లో కుక్కను వదిలి వెళ్లాడు. కాగా ఇంటి తలుపులు పగిలి ఉండటాన్ని ఆదివారం సాయంత్రం గమనించిన స్థానికులు వెంటనే వంశీకృష్ణకు సమాచారం ఇచ్చారు. దొంగలు కాపౌండ్లో ఉన్న కుక్కకు మత్తు బిస్కెట్లు వేసి, తర్వాత దానిని కట్టేసి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.45 వేలు విలువ చేసే వెండి వస్తువులు దొంగలించారు. అలాగే స్థానికంగా మరో రెండు ఇళ్లల్లో చోరీకి యత్నించారు. ఓ ఇంటిలో ఎవరూ నివాసం లేకపోవడం, మరో ఇంటికి సెంట్రల్ లాక్ కారణంగా తాళాలు తెరుచుకోక పోవడంతో దుండగులు వెనుదిరిగినట్లు తెలిసింది. బాధితుడు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.