
మూత దిశగా మహిళా మార్ట్!
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళాభ్యున్నతి లక్ష్యంగా ఏర్పాటైన మహిళా మార్ట్లను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 2021–22లో కోడుమూరులో చేయూత మహిళా మార్ట్ ఏర్పాటైంది. 2023–24 వరకు లాభాల బాటలో నడిచింది. రాష్ట్రంలోనే అత్యధిక టర్నోవర్ ఉన్న మార్ట్ల్లో ఇదీ ఒకటి. ఇలాంటి మార్ట్ ప్రస్తుతం అవినీతి, అక్రమాలతో కుదులైంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్రమాలను అరికట్టాల్సిన డీఆర్డీఏ అధికారులు మిన్నకుండిపోయారు. పైపెచ్చు అవినీతిలో భాగస్వాములయ్యారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో విచారణ చేపట్టగా, ఈ ఏడాది జనవరిలో అందుకు సంబంధించిన నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో అక్రమార్కులపై అభిమానం చాటుకున్నారు. ఎట్టకేలకు ప్రస్తుత డీఆర్డీఏ పీడీ వై.పి.రమణారెడ్డి చర్యలకు ఉపక్రమించడం విశేషం.
రూ.8.70 లక్షల దుర్వినియోగం
మహిళ మార్ట్లో ఏకంగా రూ.15 లక్షలు దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. అయితే విచారణలో రూ.8.70 లక్షలు మాత్రమే దుర్వినియోగమైనట్లు తేల్చారు. రూ.6 లక్షల విలువ సరుకులు పాడైనట్లుగా లెక్కలు చూపించి దుర్వినియోగాన్ని భారీగా తగ్గించుకున్నారనే చర్చ జరరుగుతోంది. మొత్తం దుర్వినియోగంలో ఇప్పటి వరకు ఇద్దరి నుంచి దాదాపు రూ.3.50 లక్షల వరకు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అప్పటీ డీఆర్డీఏ అధికారులు మార్ట్ను పణంగా పెట్టి ఏపీఎం, సీసీలను కాపాడంతో పాటు దుర్వినియోగాన్ని తగ్గించి చూపారనే చర్చ జరుగుతోంది.
ఒక్కొక్కరు రూ.200 పెట్టుబడితో..
కోడుమూరులో పైలెట్ ప్రాజెక్టు కింద స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ఒక్కొక్కరు కేవలం రూ.200 పెట్టుబడితో మార్ట్ ఏర్పాటు చేయడం విశేషం. మొత్తం 13వేల మంది మహిళలు సభ్యులుగా ఉండటంతో.. దాదాపు రూ.26 లక్షల నగదు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ కంపెనీలతో అనుసంధానం కావడంతో నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు సరఫరా కావడం విశేషం. ప్రయోగాత్మకంగా నెలకొల్పిన మార్ట్ పొదుపు మహిళలనే కాదు.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. 2023 వరకు రోజుకు రూ.లక్ష టర్నోవర్ ఉందంటే మార్ట్ ఏస్థాయిలో చేరువైందో అర్థమవుతోంది. అయితే రోజుకు సగటున కనిష్టంగా రూ.50 వేలు గరిష్టంగా రూ.లక్ష ఉండే టర్నోవర్ ప్రస్తుతం రూ.1000–రూ.2వేలకు పడిపోయింది.
ఏపీఎం, సీసీలది పర్యవేక్షణ లోపమేనట!
చేయూత మహిళా మార్ట్లో నిధుల దుర్వినియోగానికి ఏపీఎం, సీసీలది కేవలం పర్యవేక్షణ లోపమేనని అధికారులు తేల్చారు. మార్ట్ మేనేజర్, మార్ట్ కమిటీ అధ్యక్షురాలు, ఒక కమిటీ సభ్యురాలు నిధుల స్వాహాలో భాగస్వాములని విచారణలో వెల్లడైంది. పర్యవేక్షణ లోపంపై ఏపీఎం, సీసీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రూ.15 లక్షలకు పైగా అవినీతి
అధికారులు తేల్చిన లెక్క
రూ.8.70లక్షలే..
గతంలో రోజువారీ టర్నోవర్
లక్ష నుంచి రూ.50వేలు
ప్రస్తుతం రూ.1000 నుంచి
రూ.2వేలకే పరిమితం
అక్రమాల్లో మార్ట్ మేనేజర్, కమిటీ
అధ్యక్షురాలు, సభ్యురాలు కీలకం
ఏపీఎం, సీసీలకు షోకాజ్ నోటీసులు