
రూ.11.58 కోట్లతో ఉద్యాన పథకాలు
కర్నూలు(అగ్రికల్చర్): 2025–26లో రూ.11.58 కోట్లతో జిల్లాలో ఉద్యాన పథకాలు అమలు చేయనున్నట్లుగా జిల్లా ఉద్యాన అధికారి పి.రామాంజనేయులు తెలిపారు. రూ.8.56 కోట్లతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద కొత్త తోటల అభివృద్ధి, పాతతోటల పునరుద్ధరణ, గత రెండేళ్ల మెయిన్టెనెన్స్, మల్చింగ్, ఫాంపాండ్స్, ఉద్యాన యాంత్రీకరణ వంటి వాటిని చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాశ్ యోజన కింద రూ.62 లక్షలు మంజూరు అయ్యాయని, ఈ పథకం కింద హైబ్రిడ్ కూరగాయల సాగుకు సబ్సిడీలు ఇవ్వ డం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ ఏడాది 1589.19 హెక్టార్లలో ఆయిల్ఫామ్ సాగు చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకు రూ.2.34 కోట్లు సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలిపారు. నేషనల్ బ్యాంబు మిషన్ కింద జిల్లాలో వెదురు సాగుకు రూ.7.07 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో వెదురు సాగు చేస్తే హెక్టారుకు రూ.లక్ష, ప్రయివేటు భూముల్లో సాగు చేస్తే రూ.50వేలు సబ్సిడీ ఇస్తామని తెలిపారు.
20న రాష్ట్రస్థాయి ర్యాంకింగ్
చెస్ టోర్నమెంట్ పోటీలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన నంద్యాల పట్టణంలో రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా చెస్ అసోసియేసన్ జిల్లా చెస్ సంఘం చైర్మన్ రామకృష్ణారెడ్డి, రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డిలు పేర్కొన్నారు. గురువారం చెస్ పోటీల వివరాల పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6, 8, 10, 12, 14, 16 సంవత్సరాల్లోపు కేటగిరిలో ఓపెన్ బాలికలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారితో జాతీయ స్థాయి చెస్ స్కూల్ టోర్నమెంట్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆంధ్రా చెస్ అసోసియేషన్లో క్రీడాకారులుగా నమోదు చేసుకున్న వారు ఈనెల 16వ తేదీలోపు www.apchess.org వెబ్సైట్లో ఎంట్రీలు నమోదు చేసుకోవాలన్నారు.
శ్రీమఠానికి రెండు బ్యాటరీ వాహనాలు
మంత్రాలయం రూరల్: ప్రముఖ పుణ్యకేత్రం క్షేత్రంలో శ్రీమఠం భక్తుల సౌకర్యార్థం బెంగళూరు చెందిన ఎంఎస్ రామయ్య ఫౌండేషన్ నేతృత్వంలో రెండు బ్యాటరీ వాహనాలను గురు పౌర్ణమి సందర్భంగా శ్రీమఠానికి వితరణ చేశారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆ వాహనాలకు ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం పీఠాధిపతి, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు వై. సీతారామిరెడ్డి ఆ వాహనాలపై మఠం కారిడర్లో ప్రయాణించారు. బెంగళూరు చెందిన భక్తులు రామయ్య కుటుంబ సభ్యులకు స్వామిజీ ఫలపూలమంత్రాక్షింతాలతో ఆశీర్వదించారు. ఈ వాహనాలను మఠంలోని వృద్ధ భక్తులు, దివాంగులకు వినియోగిస్తునట్లు పీఠాధిపతి తెలిపారు. అదే విధంగా పుష్కరిణి నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, వైస్ ఎంపీపీ రాఘవేంద్ర, జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.11.58 కోట్లతో ఉద్యాన పథకాలు