
దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
కొలిమిగుండ్ల: కనకాద్రిపల్లె అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న దుకాణంలోకి ఆదివారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. వివరాలిలా ఉన్నాయి..తాడిపత్రి నుంచి ఇటుకల లోడుతో ట్రాక్టర్ కొలిమిగుండ్ల వైపు బయలు దేరింది. మార్గమధ్యలో కనకాద్రిపల్లె వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ పెద్ద టైర్ పగిలి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని పసిగట్టిన దుకాణం యజమాని కిట్టు బయటకు పరుగు పెట్టడంతో ప్రమాదం తప్పింది. టైర్ పేలిన సమయంలో ఎదురుగా వాహనాలు రాక పోవడంతో ఓరకంగా ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
కృష్ణ జింక మృతి
ఆళ్లగడ్డ: బత్తలూరు వద్ద ఆదివారం ఓ కృష్ణ జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న రుద్రవరం రేంజి అధికారులు అక్కడికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేంజ్ అధికారి మూర్తుజా అదేశాల మేరకు.. డాగ్స్క్వాడ్ ఫారెస్టర్ ఖాన్, ఎఫ్బీఓ సురేంద్ర ఇరువురు కలిసి రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె పశువైద్యాధికారి మనోరంజన్ ప్రతాప్తో పోస్టుమార్టం నిర్వహించారు. మృతి చెందిన జింకపై ఎలాంటి గాయాలు లేవని, గ్రామ సమీపంలోకి రావడంతో వీధికుక్కలు వెంబడించి ఉంటా య ని, ఆ భయంతోనే జింక మృతి చెంది ఉంటుందని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం జింక కళేబరాన్ని దహనం చేశారు.
యువకుడిపై హత్యాయత్నం కేసు
ఆదోని రూరల్: మండలంలోని జాలిమంచి గ్రామానికి చెందిన వీరేష్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పెద్దతుంబళం ఎస్ఐ మహేష్కుమార్ ఆదివారం తెలిపారు. గ్రామంలోని ఒక మహిళను యువకుడు వీరేష్ లైంగికంగా వేధించేశాడని, మహిళ ప్రతిఘటించడంతో హత్య చేసేందుకు పూనుకున్నాడన్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ఆదోని రూరల్: మండలంలోని పెద్దతుంబళం గ్రామంలో బొడ్డ మహేష్(14) అనే యువకుడు ఇంటికి క్యూరింగ్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. మృతుని తండ్రి బుడ్డ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. ఇంటికి నీటిని కూలింగ్ చేస్తుండగా విద్యుత్ మోటార్ ద్వారా షాక్కు గురై మృతిచెందాడన్నారు. తనకు ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు మహేష్ విద్యుత్ ప్రమాదంలో మరణించాడని బోరున విలపించాడు.
కలప దుకాణంలో అగ్ని ప్రమాదం
వెలుగోడు: పట్టణంలోని ఓ కలప దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో విలువైన టేకు కలప, ఫర్నిచర్, పరికరాలు, షెడ్డు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రూ. 16 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని దుకా ణ యజమాని జయరాజ్ తెలిపారు.

దుకాణంలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్