
ఆర్యూలో పరీక్షలంటేనే హడల్!
● ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2వ సెమిస్టర్లో 10 మంది విద్యార్థులు ఫెయిల్ ● 3వ సెమిస్టర్లో అదే 10 మందితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ ● వీరందరికీ మొదటి సెమిస్టర్లో 8 పాయింట్స్ పైనే మార్కులు
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో పరీక్షలంటేనే హడలెత్తాల్సిన పరిస్థితి దాపురించింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఒక సబ్జెక్టులో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత శాతం ఉంటే మరో సబ్జెక్టులో 50 శాతం కూడా దాటదు. మెరిట్ విద్యార్థులు సైతం ఫెయిల్ కా వడం పరిపాటిగా మారడం లాంటి వింత పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయి. నెల రోజుల్లో ఇవ్వాల్సిన పరీక్షల ఫలితాలు ఐదు నెలలైనా విడుదల చేయరు. తాజాగా ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యార్థులు సమస్య వెలుగులోకి వచ్చింది. వర్సిటీలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో మొదటి సంవత్సరం 33 మంది, ద్వితీయ సంవత్సరం 43 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులు 2వ సెమిస్టర్లో ఒక పేపర్కు సంబంధించి 10 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 3వ సెమిస్టర్లో సైతం అదే 10 మందితో పాటు మరో ఇద్దరు విద్యార్థులు ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఫెయిలైన విద్యార్థులందరికీ మొదటి సెమిస్టర్లో సరాసరి 8 పాయింట్స్ పైనే మార్కులు వచ్చాయి.
అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహణ
నిర్ణయంపై అసంతృప్తి
2, 3 సెమిస్టర్లలో ఫెయిలైన 10 మందికి పైగా విద్యార్థులు ఇటీవల వర్సిటీ వైస్చాన్సలర్ను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. తాము పరీక్షల్లో ఫె యిలయ్యే సమస్యే లేదు కావాలంట్ చాలెంజింగ్ వాల్యుయేషన్ చేయించండని వీసీతో వాదించారు. రీ వెరిఫికేషన్ రీ వాల్యుయేషన్కు అవకాశం ఇవ్వాల ని వేడుకున్నారు. రీవెరిఫికేషన్ రీ వాల్యుయేషన్కు అవకాశం లేదని అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రా సేందుకు అవకాశం ఇస్తామంటూ వీసీ చెప్పడంతో విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. తమ సమాధాన పత్రాలను మాకు చూయించండని ప్రశ్నించారు. వీసీని వేడుకున్నా, వాగ్వివాదం చేసినా అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తామని వీసీ చెప్పడంతో విద్యార్థులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
అధికారులు న్యాయం చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చి పీజీ చుదువుతున్న మేం పరీక్షలు బాగా రాశాం. అయినా 10 మందిని 2, 3 సెమిస్టర్లలో ఫెయిల్ చేశారు. మొదటి సెమిస్టర్లో అందరం 8 పాయింట్ల పైగా మార్కులతో ఉత్తీర్ణులమయ్యాం. 2, 3 సెమిస్టర్లలో ఫెయిల్ కావడంతో వీసీని కలిసి సమస్య విన్నవించినా, ప్రశ్నించినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ నిర్వహిస్తాం రాయండని వీసీ చెబుతున్నారు. మరో రెండు మూడు రోజుల్లో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఓపెన్ చాలెంజ్ చేస్తున్నాం. మా సమాధా న పత్రాలను మా ముందర వాల్యుయేషన్ చేయించండి. మాకు న్యాయం చేయండి.
– 2,3 సెమిస్టర్లు ఫెయిలైన విద్యార్థులు