
రెట్టింపు లాభం అంటూ మోసం చేశారు
కర్నూలు: ఇన్స్ట్రాగామ్లో స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రకటన ఇచ్చి వాట్సాప్ గ్రూప్లో లింక్ పంపి ఇద్దరు వ్యక్తులు తనతో చాట్ చేసి ఒక యాప్ ఇచ్చి, అకౌంట్ నెంబర్ ఇచ్చి పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు చూపిస్తూ ఆ డబ్బులు ఇవ్వాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని రూ.5 లక్షలు తీసుకుని సైబర్ మోసానికి గురి చేశారని కర్నూలుకు చెందిన సునిత అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరాకు ఫిర్యాదు చేశారు. కర్నూలు టూటౌన్ పక్కనున్న ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 111 ఫిర్యాదులు రాగా వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి బాధితులకు సత్వరమే న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస నాయక్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
● చెత్త బండి ఇప్పిస్తామని చెప్పి రూ.3.30 లక్షలు తీసుకుని ధనుంజయ్, జానకిరామ్ అనే వ్యక్తులు మోసం చేశారని కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన బంగారి ఫిర్యాదు చేశారు.
● 10 ఎకరాల ఆస్తిని ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకున్నారని, వచ్చిన పెన్షన్ డబ్బు కూడా వారే తీసుకుని తన బాగోగులు పట్టించుకోవడం లేదని, విచారణ జరిపి తనకు జీవనాధారం కల్పించాలని ఆస్పరి మండలం కై రుప్పల గ్రామానికి చెందిన అంగడి శివమ్మ ఫిర్యాదు చేశారు.
● కర్నూలు సంతోష్ నగర్ వద్ద ఉన్న విజయ నగర్ కాలనీలో మార్ట్గేజ్ చేసిన ఒక ప్రాపర్టీని అమ్ముతామని చెప్పి కొందరు బ్రోకర్లు అడ్వాన్స్గా డబ్బులు తీసుకుని తనతో పాటు చాలా మందిని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్కు చెందిన రెహమాన్ ఫిర్యాదు చేశారు.
● రూ.2 లక్షల విలువైన కంది పంటను నాశనం చేసి నా కుటుంబాన్ని మానసికంగా, ఆర్థికంగా కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామానికి చెందిన మాదమ్మ ఫిర్యాదు చేశారు.
అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన
బాధితురాలు