
చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి
● స్పెషల్ ఆఫీసర్ మౌర్య భరద్వాజ్
ఎమ్మిగనూరుటౌన్: చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేస్తామని ఆదోని సబ్కలెక్టర్, వైడబ్ల్యూసీఎస్ స్పెషల్ ఆఫీసర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. సొసైటీకి స్పెషల్ ఆఫీసర్గా నియామకమైన ఆయన మొదటి సారిగా గురువారం పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఉత్పత్తి కేంద్రాన్ని, గోదాంతో పాటు, విక్రయ కేంద్రం, డయింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. చేనేత ఉత్పత్తి,క్రయ విక్రయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైడబ్ల్యూసీఎస్ పరిధిలోని చేనేత కార్మికులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత ఉత్పత్తుల్లో కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత జౌళిశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజారావు, వైడబ్ల్యూసీఎస్ కార్యదర్శి అప్పాజి, డిప్యూటీ తహసీల్దార్ వీరభద్రగౌడ్ పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు వెంటనే
అప్లోడ్ చేయండి
కర్నూలు(అర్బన్): 2014–19 మధ్య కాలంలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే అప్లోడ్ చేయాలని పీఆర్ ఇంజినీరింగ్ కమిషనర్ కోరారు. గురువారం ఆయన పీఆర్ ఎస్ఈలతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్ ఎస్ఈ వీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పెండింగ్లో ఉన్న రూ.3 కోట్లకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేశామని, ఇంకా 13 పనులకు సంబంధించిన రూ.6 లక్షల బిల్లులను మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ఇందులో కూడా నాలుగు బిల్లులు ఎస్ఎస్ఏకు సంబంధించినవి ఉన్నాయని, మిగిలిన వాటిలో 9 బిల్లులను కూడా అప్లోడ్ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రూ.58 వేల బిల్లును మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ఈ గూగుల్ మీట్లో ఎస్ఈ పీఏ బండారు శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
పాములపాడు: జూటూరు గ్రామానికి చెందిన గోరపూటి సత్యం(48) కేసీ కాలువ గట్టుపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం మేరకు ఎస్ఐ సురేష్బాబు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.
రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు: గుర్తు తెలియని వ్యక్తి కర్నూలు రైల్వే స్టేషన్లో మృతిచెందాడు. రైల్వే పీఎస్ హెడ్ కానిస్టేబుల్ మాధవస్వామి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదమా లేదంటే సాధారణ మరణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతి చెందని వ్యక్తి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కాషాయం రంగు టవల్, తెలుగు రంగు చొక్కా ధరించాడు. కుడి చేతిపైన 96975368 అనే సంఖ్యలు గల టాటూ మార్కు ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ మాధవస్వామి తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 9030481295, 9441802327కి సమాచారం అందించాలన్నారు.

చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి

చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి