కుటుంబ నియంత్రణపై
విస్తృతంగా కార్యక్రమాలు
జిల్లాలో ఇక కుటుంబ నియంత్రణపై కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తాము. ముఖ్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, నియంత్రణ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. కుటుంబ నియంత్రణ పాటిస్తే కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాము. ఎప్పటిలాగే కుటుంబ నియంత్రణ పద్ధతులు, ఆపరేషన్లు చేయించుకున్న వారికి ప్రోత్సాహక నగదు కూడా అందజేస్తున్నాము. –డాక్టర్ బి. రామగిడ్డయ్య,
డీఎంహెచ్ఓ, కర్నూలు
వెంట వెంటనే ప్రసవాలతో
అనారోగ్యం
అధిక జనాభా పర్యావరణం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల తల్లికి, జన్మించిన బిడ్డకు, మళ్లీ జన్మించబోయే బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వెంట వెంటనే బిడ్డను ప్రసవించడం వల్ల గర్భం బలహీనమై తల్లికి భవిష్యత్లో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. వారికి జన్మించే బిడ్డలు సైతం పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
–డాక్టర్ టి. జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఇంటికి ఇద్దరు, ముగ్గురు చుట్టాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఆదరిస్తారు. వారే రోజుల తరబడి ఉంటే ఎప్పుడు వెళ్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వారు ఉండే ప్రతి రోజూ ఆ కుటుంబానికి ఆర్థికభారం పెరుగుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలైతే ఈ భారాన్ని మోయలేవు. అలాగే పెరుగుతున్న జనాభాను మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలూ తట్టుకోలేవు. కుటుంబం లాగానే ఆయా దేశాల అభివృద్ధికి జనాభా పెరుగుదల పెద్ద అవరోధమవుతుంది. అందుకే పరిమిత కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పాలకులు చెబుతుంటారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 24,26,722 మంది ఉన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి 3 నుంచి 4 లక్షల జనాభా పెరుగుతుంది. ఈ కారణంగా భూమి, ధాన్యం, ధనం లభించడం ఇబ్బందిగా మారుతుంది. అధిక జనాభా కారణంగా ప్రతి ఇంట్లో సమస్యలే. ఈ కారణంగా చాలా మంది ఇప్పటికే కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నారు. పాతికేళ్ల క్రితం జంటకు ముగ్గురు, నలుగురు సంతానం ఉండేవారు. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు చాలనుకుంటున్నారు. అయితే, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో జనాభా పెరగాలని గత తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసి కుటుంబ నియంత్రణ పద్ధతులను నీరుగార్చింది. జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 కుటుంబ నియంత్రణ పద్ధతులను గాడిలో పెట్టింది. అయితే, వరుసగా రెండేళ్లు కోవిడ్ ఉధృతి కారణంగా కుంటుపడిన ఈ కార్యక్రమం గతేడాది నుంచి మళ్లీ ఉధృతమైంది. కుటుంబ నియంత్రణ పాటించిన వారికి, ప్రోత్సహించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులు ప్రదానం చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పీపీ యూనిగ్, గడియారం ఆసుపత్రి, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీ యూనిట్, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, కోడుమూరు, ఓర్వకల్లు, పత్తికొండ, వెల్దుర్తి, ఆలూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో కర్నూలులో మాత్రమే డీపీఎల్(బటన్హోల్) ఆపరేషన్లు చేస్తున్నారు.
కుటుంబ నియంత్రణకు ప్రోత్సాహకాలు
కర్నూలు బోధనాసుపత్రి, నంద్యాల జిల్లా ఆసుపత్రుల్లో ప్రసవానంతరం వెంటనే ఆంత్రా ఇంజెక్షన్లు బాలింతలకు ఇస్తున్నారు. ఇది కూడా బాలింత, ఆమె కుటుంబసభ్యుల అనుమతి తీసుకుని ఇస్తున్నారు. దీనివల్ల మళ్లీ మూడేళ్ల వరకు మహిళ గర్భం దాల్చకుండా ఉంటుంది. దీంతో పాటు నిరోద్లు, గర్భనిరోధక మాత్రలను ఆయా ఆసుపత్రుల్లో ప్రత్యేక బాక్స్ల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన పీపీ ఐయూసీడీ చేయించుకున్న వారిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసి రూ.10వేలు ప్రోత్సాహక నగదు ఇస్తున్నారు. అలాగే పీపీ యూనిట్లో ఆంత్రా ఇంజెక్షన్లను ప్రోత్సహించే కౌన్సిలర్లకు లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసి రూ.5 వేలు, పీపీ ఐయూసీడీలను ప్రోత్సహించే ఏఎన్ఎం/ఆశలను ఎంపిక చేసి వారికీ రూ.5వేలు, పీపీఐయూసీలను ప్రమోట్ చేసిన వైద్యులకు రూ.10వేల చొప్పున ఇవ్వనున్నారు.
పెరిగే జనాభాకు అడ్డుకట్ట వేద్దాం
జనాభాతో కుటుంబ,
దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
కు.ని పాటించిన వారికి
ప్రోత్సాహక నగదు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
నాలుగేళ్లలో కు.ని వివరాలు
సంవత్సరం లక్ష్యం లక్ష్య సాధన (శాతం)
2018–19 25,000 17,569 (70.28)
2019–20 25,000 16,556 (66.22)
2020–21 25,000 7,728 (30.91)
2021–22 14,058 7,575 (53.88)
(మార్చి)
2022–23 13,563 7,680 (56.62)


