కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో కనిపించని క్రీడామైదానాలు తరగతి గదుల్లో పాఠాలకే పరిమితం అవుతున్న విద్యార్థులు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్ల యాజమాన్యాలు కనీసం ఇండోర్ గేమ్స్ ఆడేందుకూ అవకాశం కల్పించని వైనం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 80 శాతం స్కూళ్లకు మైదానాలు కరువు
కృష్ణా జిల్లాలో ఇలా..
సాక్షి, విజయవాడ: కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో క్రీడామైదానాలు కరువయ్యాయి. ఈ విద్యా సంస్థల్లో బాల్యం తరగతి గదుల్లోనే మగ్గిపోతోంది. పుస్తకాలతో కుస్తీ పడుతూ, మార్కులు, ర్యాంకుల సాధనకే పరి మితం అవుతోంది. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లలో సైతం క్రీడామైదానాలు సమకూర్చుకోవడంలేదు. కేవలం పుస్తకాలు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు మాత్రమే కాదు, క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసంలో కీలక భాగమే. పాఠశాలల్లో క్రీడా మైదానాలు, శారీరక విద్య, క్రీడా కార్యక్రమాలు కూడా విద్యా మౌలిక వసతుల్లో భాగం. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అనేక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడేందుకు తగిన మైదానాలు ఉండడం లేదు. ప్రధానంగా విజయ వాడతో పాటు నగర శివారు గ్రామాలు, మచిలీ పట్నం, గుడివాడ, పెనమలూరు, కంకిపాడు, కానూరు, గంగూరు, తాడిగడప, గన్నవరం, నందిగామ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 80 శాతం విద్యాసంస్థలకు క్రీడామైదానాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.లక్షల్లో ఫీజులు వసూలు
పలు కార్పొరేట్ స్కూళ్లు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. తరగతి గదులు, స్మార్ట్ క్లాసులు, ప్రయోగశాలలు, రవాణా వంటి సదు పాయాలపైనే ఆయా స్కూళ్ల యాజమాన్యాలు దృష్టి పెడుతున్నాయే తప్ప, క్రీడా మైదానం, శారీరక విద్య, క్రీడా పరికరాలు, మౌలిక వసతులు కల్పనను పట్టించుకోవడంలేదు. ఎక్కడో ఒకటీ అరా స్కూళ్లలో మాత్రం పరిమితంగానే క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. విజయవాడలో ఇళ్ల మధ్య ఉన్న చాలా స్కూళ్లలో క్రీడా మైదా నాలు లేవు. కనీసం స్కూలు ప్రాంగణంలో కూర్చోవడానికి కూడా స్థలం కనిపించడంలేదు.
నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే..
2026 జనవరి 19న కేంద్ర విద్యామండలి జారీ చేసిన జీఓ నంబరు 04/2026 ప్రకారం స్కూల్ క్యాంపస్లలో కనీసం రెండు వేల చదరపు మీటర్ల ఆటస్థలం ఉండాలి. ఔట్డోర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం తగిన స్థలం, 200 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్తో పాటు ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ తదితర క్రీడలకు సదుపాయాలు కల్పించాలి. స్కూళ్లలో పీఈటీ తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో స్థాయిని బట్టి (ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్) వెయ్యి నుంచి నాలుగు వేల చదరపు మీటర్ల మేర ఆటస్థలం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో హైస్కూళ్ల ఏర్పాటుకు ఆటస్థలంతో కలిపి ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు స్థలం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే స్కూల్ ప్రాంగణంలో స్థలం లేకపోతే ప్రత్యామ్నాయంగా ఇండోర్ స్టేడియాలు, సమీప ప్రాంతాల్లో ఉండే మునిసిపల్ / పబ్లిక్ గ్రౌండ్లను ఉపయోగించుకునేందుకు అధికారులు తనిఖీ చేసి అనుమ తులు ఇస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి పదో తరగతి వరకు వ్యాయామ విద్యను తప్పనిసరి చేసింది. అయితే చాలా స్కూళ్లలో ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. ఒక ప్రైవేట్ పాఠశాలకు గుర్తింపు ఇస్తున్నప్పుడు లేదా గుర్తింపును కొనసాగిస్తున్నప్పుడు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులదే. అయితే వారు కళ్లు మూసుకుని అనుమ తులు ఇచ్చేస్తున్నారు. అసలు ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఉన్నాయా? మైదానం లేకుంటే ప్రత్యామ్నాయంగా పిల్లలకు ఆటలు ఎలా ఆడిస్తున్నారు? వంటి అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి అనుమతులు ఇవ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో బాగా పేరున్న స్కూళ్లే ఉన్నాయి. కానీ ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా అవకాశం లేని దుస్థితి ఆ స్కూళ్ల నెలకొంది.
కృష్ణా జిల్లాలో మొత్తం 536 ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 517 స్టేట్ సిలబస్, 14 సీబీఎస్ఈ, మరో ఐదు ఐసీఎస్ఈ స్కూళ్లు. మొత్తం 1,26,112 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సహా చాలా స్కూళ్లకు గ్రౌండ్లు లేవు. ఇటీవల కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్పోర్ట్స్కి ఒక పీరియడ్ కేటాయిస్తున్నా ఆడుకోవడానికి ఆటస్థలాలు లేవు. రూ.లక్షల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే జిల్లా, రాష్ట్ర, దేశవాళీ పోటీల్లో రాణిస్తున్నారు. పెడన నియోజకవర్గంలో 21 ప్రైవేటు స్కూళ్లు ఉండగా 15 స్కూళ్లకు, గుడివాడలో 23 స్కూళ్లకు 17, గన్నవరంలో 78 స్కూళ్లకు 55 స్కూళ్లకు, పామర్రులో 65 ప్రైవేటు స్కూళ్లకు 15 స్కూళ్లలో, అవనిగడ్డలో 23 స్కూళ్లకు 10 స్కూళ్లకు అసలు మైదానాలే లేవు.


