కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): పారిశ్రామికవేత్తల సంక్షేమం, వ్యాపారాల విస్తరణే లక్ష్యంగా ఇండస్ట్రియల్ బిజినెస్ మీట్ చేపట్టామని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. జిల్లాలోని పారిశ్రామిక, వ్యాపార రంగాల అభివృద్ధికి ప్రోత్సహం అందించేందుకు, ఎదురవుతున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఈ కార్యక్రమం గురువారం జరిగింది. 180 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు హాజరై తమ అవసరాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఇటీవల కృష్ణా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వర్క్షాప్ అనంతరం జరిగిన చర్చలో పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు తమ సమస్యలను వివరించారని పేర్కొన్నారు. వారికి జిల్లా యంత్రాంగం పరిధిలో సాధ్యమైన సహాయాన్ని అందిస్తామన్నారు. ఫైనాన్స్కు సంబంధించిన దరఖాస్తులు అధికంగా రావటంతో అర్హులైన పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులకు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఉద్యాన శాఖ అధికారి జె.జ్యోతి, ఎల్డీఎం రవీంద్రరెడ్డి, మత్స్య శాఖ అధి కారి ఎ.నాగరాజు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఎల్.వి.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


